
కోల్కతా: ఉద్యోగాలు కోల్పోయి నిరసనకు దిగిన సుమారు 150 మంది ఉపాధ్యాయులను కోల్కతా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తమలో అర్హులైన వారిని శాశ్వత ప్రాతిపదికన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఎంపిక పరీక్ష పెడతామంటూ పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన తెలిపేందుకు సెక్రటేరియట్ వైపు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని 100 మందిని అరెస్ట్ చేశారు.
కోల్కతాలోని సెంట్రల్ పార్క్ వద్ద కూడా మరో 500 మంది మాజీ ఉపాధ్యాయులు ఇదే డిమాండ్తో ఆందోళన చేపట్టారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో సాల్ట్లేక్, ఎస్ప్లనేడ్ల వద్ద వందలాది మంది టీచర్లు నిరసనకు దిగారు. సెక్రటేరియట్ వైపు వెళ్తున్న వీరిని పోలీసులు ఆపేశారు. తమ పరిస్థితిని వివరించేందుకు సీఎం మమతా బెనర్జీ అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సాల్ట్లేక్ వద్ద 500 మంది మాజీ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు.
అయితే, టీచర్లు షర్టులు తీసేసి ర్యాలీ చేపట్టడాన్ని పోలీసులు అనుమతించలేదు. కోల్కతా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెంట్రల్ పార్క్ వద్ద నిరసన చేపట్టేందుకు వీరికి వీలు కలి్పంచారు. అయితే, ట్రాఫిక్కు అంతరాయం కలిగించేందుకు యత్నించిన 50 మంది మాజీ టీచర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మహిళా పోలీసులతో జరిగిన తోపులాటలో కాలికి గాయమైన ఓ మాజీ ఉపాధ్యాయినిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించామన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయం వద్ద గత 22 రోజులుగా కొందరు బాధితులు నిరసన సాగిస్తున్నారు. 2016లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు చేపట్టిన ఎంపిక పరీక్షల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని తేలడంతో సుప్రీంకోర్టు ఏప్రిల్ 3వ తేదీన మొత్తం 25,753 మంది టీచర్ల నియామకాలు చెల్లవంటూ సంచలన తీర్పు వెలువరించడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గురువారం 40 వేల టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసిన అనుభవమున్న టీచర్లకు ఈ పరీక్షలో అదనంగా మార్కులుంటాయని ప్రకటించింది.