కోల్‌కతా డాక్టర్‌ ఉదంతం: ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ | kolkata doctor incident: CBI Chargesheet ruled out west bengal | Sakshi
Sakshi News home page

కోల్‌కతా డాక్టర్‌ ఉదంతం: ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ

Oct 7 2024 3:12 PM | Updated on Oct 7 2024 3:49 PM

kolkata doctor incident: CBI Chargesheet ruled out west bengal

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వేస్టిగేషన్‌ (సీబీఐ) తాజాగా ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. సోమవారం మధ్యాహ్నం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జిషీటును సమర్పించింది.

ఈ ఘటనలో సామూహిక అత్యాచారం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన కోల్‌కతా పోలీసులతో కలిసి వాలంటీర్‌గా పనిచేసిన నిందితుడు సంజయ్ రాయ్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశాడని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. రాయ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్‌లో తెలిపింది.

జూనియర్‌ డాక్టర్‌ ఆగస్టు 9న ఆర్జీకర్‌ ఆస్పత్రిలో మృతిచెందినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది, మెడికల్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును కోల్‌కతా హకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుడు సంజయ్‌ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇతర ఆధారాలతో సహా సంజయ్‌ రాయ్‌ను సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.

ఇక.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జూనియర​్‌ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు.

చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ

Advertisement
 
Advertisement
Advertisement