తిరువనంతపురం: ఇకపై కేరళ టూరిస్ట్ బస్సులు కర్ణాటక, తమిళనాడుకు వెళ్లవు. ఆ రెండు రాష్ట్రాలకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కేరళ రాష్ట్ర కమిటీ లగ్జరీ బస్సు యజమానుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. దీని వెనుకగల కారణం ఏమిటి? ఆయా రాష్ట్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా? అనే విషయంలోకి వెళితే..
కేరళ నుండి తమిళనాడు, కర్ణాటకకు అంతర్రాష్ట్ర పర్యాటక బస్సు సర్వీసులను (నేడు)సోమవారం సాయంత్రం 6 గంటల నుండి నిలిపివేస్తున్నట్లు లగ్జరీ బస్సుల యజమానుల సంఘం, కేరళ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పొరుగు రాష్ట్రాలు భారీ జరిమానాలు విధించడం, చట్టవిరుద్ధమైన రాష్ట్ర స్థాయి పన్నులు విధించడం, దీనికితోడు కేరళ ఆపరేటర్లకు చెందిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (ఏఐటీపీ) బస్సులను సీజ్ చేయడం తరచూ జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏజే రిజాస్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం కింద జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఏఐటీపీలు ఉన్నప్పటికీ, కేరళ నుండి వచ్చే పర్యాటక వాహనాలను తమిళనాడు, కర్ణాటకలో ఆపడం, జరిమానా విధించడం, నిర్బంధించడం జరుగుతున్నదని ప్రధాన కార్యదర్శి మనీష్ శశిధరన్ మీడియాకు తెలిపారు. ‘ఏడాదిగా తమిళనాడు అధికారులు కేరళలో రిజిస్టర్ అయిన వాహనాల నుండి ఇష్టారాజ్యంగా పన్ను వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఆపరేటర్లకు, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేరళ ప్రభుత్వం కూడా తమకు సహకరించడంలేదని అన్నారు.
వాహనాలను స్వాధీనం చేసుకుంటున్న కారణంగా చాలా మంది ఆపరేటర్లు అంతర్రాష్ట్ర సేవలను నిర్వహించేందుకు వెనుకాడుతున్నారని తెలిపారు. ఈ సర్వీస్ సస్పెన్షన్ స్వచ్ఛంద నిరసన కాదని, వాహనాలు, డ్రైవర్లు, ప్రయాణికుల భద్రత కోసం తీసుకున్న చర్య అని అసోసియేషన్ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు సమావేశం కావాలని అసోసియేషన్ అభ్యర్థించింది. అలాగే ఈ సమస్య పరిష్కారానికి అసోసియేషన్ కేరళ రవాణా మంత్రి కేబీ గణేష్ కుమార్కు కూడా ఒక లేఖ రాసింది.
ఇది కూడా చదవండి: ‘శ్వాస చంపేస్తోంది’.. ఢిల్లీలో భారీ నిరసనలు


