
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ పలు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా మరికొన్ని రోజులు కొనసాగనున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి సముద్ర మట్టంలో ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్య గుజరాత్ పరిసర ప్రాంతాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. కేరళ తీరంలో గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో కేరళలోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పతనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ, ఇడుక్కి, ఎర్నాకుళం, వయనాడ్లలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.