
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అధికారిక భవనం ఔట్హౌస్లో సగం కాలిన స్థితిలో కరెన్సీ కట్టలు వెలుగుచూసిన ఘటనలో అప్రతిష్టను మూటగట్టుకున్న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yashwant Varma)ను అభిశంసించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమవేశాల్లో ఈమేరకు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడేందుకు వీలుగా అన్ని ప్రధాన రాజకీయ పక్షాల నేతల సమ్మతిని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు త్వరలో సమావేశంకానున్నారని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ముగ్గురు జడ్జీల విచారణ కమిటీ సైతం జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా నివేదికను రూపొందించిన నేపథ్యంలో ప్రభుత్వం అభిశంసనకు(Impeachment) రంగం సిద్ధంచేస్తోంది.
ఘటన వెలుగుచూసిన కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా అనాడే జస్టిస్ యశ్వంత్ను రాజీనామా చేయాలని మౌఖికంగా కోరినా అందుకు ఆయన నిరాకరించినట్లు వార్తలొచ్చాయి. ఈ ఉదంతం తర్వాతే రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు సీజేఐ హోదాలో జస్టిస్ ఖన్నా ఒక సిఫార్సు లేఖ రాశారు. జస్టిస్ యశ్వంత్ను అభిశంసించాల్సిందేనని ఆయన సిఫార్సుచేశారు.
జూలై మూడోవారంలో మొదలయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament Monsoon Session) ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే వీలుంది. లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ఈ తీర్మానాన్ని తీసుకొస్తారు. ఎంపీల్లో మూడింట రెండొంతుల మధ్య అనుకూలంగా ఓటేస్తేనే తీర్మానానికి ఆమోదముద్రపడుతుంది. రాజ్యసభలో కనీసం 50 మంది, లోక్సభలో కనీసం 100 మంది సభ్యులు తమ సమ్మతి తెలపాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: జడ్జి నోట్ల కట్టల వ్యవహారం.. దాన్ని గోప్యంగానే ఉంచుతాం!