లింగ సమానత్వంలో భారత్‌ ముందడుగు | India advancing in gender equality | Sakshi
Sakshi News home page

లింగ సమానత్వంలో భారత్‌ ముందడుగు

Oct 28 2024 6:28 AM | Updated on Oct 28 2024 6:28 AM

India advancing in gender equality

సామాజిక కట్టుబాట్లు, భద్రత అడ్డంకి: ఐరాస 

న్యూఢిల్లీ: లింగ సమానత్వంలో భారత్‌ సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకమని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. అయితే సామాజిక కట్టుబాట్లు, పరిమిత శ్రామిక భాగస్వామ్యం, సరైన భద్రత లేకపోవడం లింగ సమానత్వానికి ఇంకా ఆటంకం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ప్రయత్నాలు అవసరమని సూచించింది.

 దేశంలో మహిళల పురోగతి, సవాళ్లపై ఐరాస మహిళా వ్యూహాత్మక భాగస్వామ్యాల డైరెక్టర్‌ డేనియల్‌ సీమౌర్, భారత్‌లో ఐరాస మహిళల కంట్రీ రిప్రజెంటేటివ్‌ సుసాన్‌ జేన్‌ ఫెర్గూసన్‌ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళల జీవితాలను మార్చడానికి, మహిళలు, బాలికల నిర్దిష్ట అవసరాలకు బడ్జెట్‌లో 6.8 శాతానికి నిధులు పెరిగాయన్నారు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో అంతరాలను తొలగించడానికి బడ్జెట్‌ నిరంతర విస్తరణ అవసరమని నొక్కి చెప్పారు. 

ఈ లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు అవసరమని ఫెర్గూసన్‌ పేర్కొన్నారు. పంచాయతీలు, స్థానిక ప్రభుత్వ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యంతో నాయకత్వంలో కూడా పురోగతి కనిపిస్తోందని చెప్పారు.  పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందడం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావాన్ని చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే లింగ ఆధారిత హింస (జీబీవీ) దేశంలో నిరంతర సమస్యగా ఉందని, ఇది మహిళల భద్రత, స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని అధికారులు ఎత్తిచూపారు.

 చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ సామాజిక కట్టుబాట్లు మహిళలను అడ్డంకిగా మారాయన్నారు. మహిళల భద్రతపై దృష్టి సారించే కమ్యూనిటీ పోలీసింగ్‌ ప్రయత్నాలను ప్రవేశపెట్టడానికి, పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో యూఎన్‌ ఉమెన్‌ సహకరిస్తోందని తెలిపారు. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2022–23 ప్రకారం దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగినప్పటికీ, సవాళ్లు ఉన్నాయని, పిల్లల సంరక్షణ, సురక్షిత రవాణా, పనిప్రాంతంలో భద్రతతో మహిళలు మరిన్ని ఆర్థిక అవకాశాలు పొందగలుగుతారని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement