వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా? | This Is How BJP Reacts To Raj Uddhav Thackerays Reunion Buzz, Says Did He Ask His Wife? | Sakshi
Sakshi News home page

వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?

Apr 21 2025 8:47 AM | Updated on Apr 21 2025 9:38 AM

This Is How BJP Reacts to Raj Uddhav Thackerays reunion buzz

మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ పరిణామం.. దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. రెండు దశాబ్దాలుగా రాజకీయ విరోధులుగా ఉన్న సోదరులు ఉద్దవ్‌ థాక్రే, రాజ్‌ థాక్రేలు కలిసి పోనున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ కలయిక ప్రచారాన్ని బీజేపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తోంది.

ముంబై: యూబీటీ సేన-ఎంఎన్‌ఎస్‌ పొత్తు అవకాశాలపై ఓ హిందీ న్యూస్ ఛానెల్‌  పాడ్‌కాస్ట్‌లో మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్‌ నారాయణ్‌ రాణే(Nitesh Narayan Rane) ఈ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఎంఎన్‌ఎస్‌తో థాక్రే శివసేన చేతులు కలపబోతోందా?. ఈ విషయంలో తన భార్య రష్మీ థాక్రే(Rashmi Thackeray) అనుమతి తీసుకున్నారో లేదో?.  ఈ విషయాన్ని ఉద్దవ్‌ థాక్రేను మీరే(న్యూస్‌ యాంకర్‌ను ఉద్దేశించి..) అడగాలి. ఇలాంటి నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యమే ఎక్కువ అనే విషయం ఆయన మరిచిపోవొద్దు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

శివసేన నుంచి రాజ్‌ థాక్రే(Raj thackeray) నిష్క్రమణకు రష్మీనే కారణమన్న రాణే.. ఆ సమయంలో సోదరుల మధ్య ఎలాంటి విబేధాలు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రజలు మయూతీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని.. కాబట్టి ఎంఎన్‌ఎస్‌, యూబీటీ శివసేన పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. ఇక్కడి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నితీశ్‌ రాణే అన్నారు.

ఈ క్రమంలో ఏక్‌నాథ్‌ షిండే-రాజ్‌ థాక్రే విందు సమావేశంపైనా రాణేకు ప్రశ్న ఎదురైంది. షిండేకు బాల్‌ థాక్రే కుటుంబానికి దశాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా రాజ్‌ థాక్రేను బాల్‌ థాక్రేకు అంశగా షిండే భావిస్తుంటారు. అంతేగానీ వాళ్ల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది కాదు అని రాణే అన్నారు. 

మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్‌ థాక్రేతో కలిసి పని చేసేందుకు సిధ్ధమని ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. ఇందుకు ఉద్ధవ్‌ థాక్రే కూడా సానుకూలంగా స్పందించడంతో ఇరువురు ఏకం కానున్నారనే వార్తలు విస్తృతమయ్యాయి. అయితే దీనిపై తాజాగా యూబీటీ సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) మాట్లాడుతూ.. రాజకీయ పొత్తుకు సంబంధించి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, కేవలం వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: నా బద్ధ శత్రువుకి కూడా ఈరోజు రాకూడదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement