న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక భారీ సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ ఎంపీ నరేష్ కుమార్ గుజ్రాల్ సైబర్ నేరగాళ్ల చేతిలో ఏకంగా రూ. 7.80 కోట్ల మేరకు మోసపోయారు. ఆయనలాగే నటిస్తూ (ఇంపర్సనేషన్) దుండగులు ఆయన సిబ్బందిని బురిడీ కొట్టించి ఈ భారీ మొత్తాన్ని కాజేశారు. ఈ ఘోర సైబర్ దోపిడీపై ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేసింది.
ప్రొఫైల్ పిక్చర్తో మాయాజాలం
సైబర్ నేరగాళ్లు ఈ ఘరానా మోసానికి సరికొత్త పంథాను ఎంచుకున్నారు. నరేష్ కుమార్ గుజ్రాల్ ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుని, ఆయన ఆఫీస్ సిబ్బందికి మెసేజ్లు పంపారు. తాను ప్రస్తుతం ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, అర్జంట్గా ఆర్టీజీఎస్ ద్వారా నిర్దేశిత బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయాలని సదరు ఉద్యోగిని నమ్మించారు. అవతలి ఉన్నది తన బాసేనని నమ్మిన ఆ ఉద్యోగి, సదరు ఖాతాకు రూ. 7.80 కోట్లు బదిలీ చేశాడు.
అప్రమత్తతతో దక్కిన ఊరట
ఈ అనుమానాస్పద లావాదేవీపై సదరు ఉద్యోగి నరేష్ గుజ్రాల్ కుమార్తె దీక్షా గుజ్రాల్కు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆమె తన తండ్రిని సంప్రదించగా, తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. తాము సైబర్ మోసానికి గురయ్యామని గ్రహించిన దీక్షా గుజ్రాల్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారత సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ '1930'కు ఫిర్యాదు చేసి, ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సైబర్ విభాగం అధికారులు తక్షణమే స్పందించి, ఆ అకౌంట్లను సీజ్ చేయడంతో దాదాపు రూ. 4 కోట్లు (మొత్తం సొమ్ములో 70 శాతానికి పైగా) ఫ్రీజ్ అయింది.
ఎవరీ నరేష్ గుజ్రాల్?
వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన నరేష్ గుజ్రాల్, శిరోమణి అకాలీదళ్ పార్టీలో కీలక సీనియర్ నేత. ఆయన 2007 నుండి 2022 వరకు పంజాబ్ తరఫున రాజ్యసభ సభ్యునిగా సేవలు అందించారు. అంతకుముందు 2004 లోక్సభ ఎన్నికల్లో జలంధర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన తండ్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ 1997-1998 మధ్యకాలంలో భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ ఈ డబ్బు ఎక్కడికి చేరిందనే ‘మనీ ట్రైల్’ను గుర్తిస్తూ, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: ‘తుఫాన్ వారియర్’గా మోహన్లాల్


