తాగుబోతు భర్తతో విసిగి.. రికవరీ ఏజెంట్‌తో పెళ్లి | Fed Up With Abusive Husband She Married Loan Shark In Bihar, More Details Inside | Sakshi
Sakshi News home page

తాగుబోతు భర్తతో విసిగి.. రికవరీ ఏజెంట్‌తో పెళ్లి

Feb 13 2025 1:59 PM | Updated on Feb 13 2025 3:29 PM

Fed up With Abusive Husband she Married Loan Shark

రోజూ మద్యం తాగి వచ్చి వేధింపులకు గురిచేస్తున్న భర్తపై ఆమెకు విరక్తి కలిగింది. మద్యం తాగవద్దని ఎంత చెప్పినా వినని భర్త తీరుపై విసుగు చెందిన ఆ ఇల్లాలు ఒక విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. విషయం తెలుసుకున్న కొందరు భర్తకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని జముయీలో విచిత్రమైన ప్రేమకథ వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ఇంద్రకుమారి మందుబాబు అయిన తన భర్తను విడిచిపెట్టి, లోన్‌ రికవరీ ఏజెంట్‌ పవన్‌ కుమార్‌ను ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. ఈ ప్రేమ పెళ్లిని ఇక్కడివారంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఇంద్రకుమారికి 2022లో చకాయీ నివాసి నకుల్‌ శర్మతో వివాహం జరిగింది. అయితే నకుల్‌ శర్మ నిత్యం మద్యం తాగేవాడు. గృహహింసకు కూడా పాల్పడేవాడు. దీంతో ఇంద్రకుమారి భర్త తీరుకు విసిగిపోయింది.

ఇదేసమయంలో ఆమెకు వవన్‌ కుమార్‌ యాదవ్ పరిచయమయ్యాడు. పవన్‌ ఒక ఫైనాన్స్‌ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మధ్య కుదిరిన స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 4న వారు తమ ఇళ్లలో చెప్పకుండా, అసన్‌సోల్‌ చేరుకున్నారు. అక్కడ ఇంద్రకుమారి మేనత్త ఉంటోంది. ఫిబ్రవరి 11న ఇంద్రకుమారి, పవన్‌ కుమార్‌ అక్కడి ఒక శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి పవన్‌ కుటుంబ సభ్యులు మద్దతునివ్వగా, ఇంద్రకుమారి కుటుంబ సభ్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చకాయీ పోలీస్‌ స్టేషన్‌లో పవన్‌పై ఫిర్యాదు చేశారు.

ఇంద్రకుమారి మీడియాతో మాట్లాడుతూ తన ఇష్టాపూర్వకంగానే పవన్‌ను వివాహం చేసుకున్నానని తెలిపారు. పవన్‌పై పోలీసులకు ఫిర్యాదు అందిన నేపధ్యంలో ఈ జంట తమకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతోంది. మరి పోలీసులు ఈ జంట విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. 

ఇది కూడా చదవండి: న్యూఢిల్లీ: వందరోజుల కార్యాచరణకు బీజేపీ కసరత్తు

Advertisement
 
Advertisement
Advertisement