
ధరలు పడిపోవడంతో రోడ్డెక్కిన అన్నదాత
రోజురోజుకు తగ్గిపోతున్న ఉల్లిగడ్డల ధరలు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
పెట్టుబడి కూడా దక్కదని ఉల్లి రైతుల ఆవేదన
సాక్షి,బళ్లారి: ఏడాది నుంచి ఉల్లి ధరలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో ఉల్లి పంటను సాగు చేసిన రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పని చేసి పంట చేతికందిన తర్వాత, దళారుల చేతుల్లో ధర నిర్ణయం కావడంతో రైతులు ఎవరికి తమ గోడు చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి గడ్డల ధరలు కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, రైతుకు కనీసం కిలోకు రూ.10లు కూడా దక్కకపోతే ఆ రైతుకు పెట్టుబడి కాదు కదా కనీసం కూలి కూడా దక్కని పరిస్థితి ఏర్పడుతోంది.
పంట చేతికందిన తర్వాత మార్కెట్కు తీసుకెళ్లిన ఉల్లిని సాగు చేసిన రైతుకు మార్కెట్లో ఉన్నఫళంగా క్వింటాల్ ధర రూ.250లు పలకడంతో ఒక కిలో కేవలం రూ.2.50 మాత్రమే పలుకుతుండటంతో రైతు ఏం చేయాలో పాలు పోక, మార్కెట్ మాయజాలం చూసి భరించలేక సదరు రైతు వినూత్నంగా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాలను దుమ్మెత్తిపోస్తూ, దళారుల మోసాన్ని ఎండగడుతూ తాను కష్టపడి పండించిన పంటను నడిరోడ్డుపై పారబోశారు.
రోడ్డుపై పారబోసి రైతన్న పొర్లుదండాలు
వందకు పైగా ఉల్లిగడ్డల సంచులను రోడ్డుపై పారబోసి వాటిపైన దొర్లుతూ తమ ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన మంగళవారం విజయపుర నగరంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. విజయపుర జిల్లా కొల్హార తాలూకా రోణిహాళ గ్రామానికి చెందిన నందప్ప గుడ్డద మల్లికార్జున గూలగుండ అనే రైతు తాను పండించిన ఉల్లిగడ్డలను విజయపురకు తీసుకురాగా అమాంతంగా క్వింటాల్కు రూ.250లు ధర మాత్రమే పలకడంతో రైతు కన్నీరు పెట్టుకున్నారు.
తాను పండించిన పంటను పారవేస్తాను లేదా దానం చేస్తాను కాని క్వింటాల్కు రూ.250లు అమ్మబోనని చెబుతూ వాటిని అందరూ చూస్తుండగా, మార్కెట్ పక్కనే ఉన్న జాతీయ రహదారిపై పారవేసి వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేయడం అందరిని కలిచివేసింది. ఏడాది నుంచి ఉల్లిగడ్డల ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంట చేతికందిన తర్వాత ధరలు పడిపోతే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.
గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి
ఉల్లిగడ్డల ధర కిలో రూ.70 దాటితే వెంటనే ప్రభుత్వం ఏపీఎంసీల్లో తక్కువ ధరలకు ఉల్లిగడ్డలు విక్రయిస్తుందని, అదే ఉల్లిగడ్డల ధరలు పడిపోతే ప్రభుత్వం రైతుల నుంచి ఎందుకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయకూడదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక్క విజయపుర జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లిగడ్డలు సాగు చేసిన రైతులందరూ ఽఉల్లిధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా దక్కక అప్పుల పాలవుతూ కన్నీరు పెడుతున్నారు.
బహిరంగ మార్కెట్లో వినియోగదారులు కొంటున్న ధరలకు, రైతులకు మార్కెట్లో పలుకుతున్న ధరలకు కూడా చాలా వ్యత్యాసం ఉండటంతో రైతులకు మరింత నష్టాలు వస్తున్నాయి. ఉల్లిగడ్డల ధరలు పడిపోయినప్పుడు వినియోగదారుల గురించి ఆలోచించడం సరైందేనని, అయితే అదే సందర్భంలో ఉల్లిగడ్డల ధరలు పడిపోయినప్పుడు కూడా వాటిని పండించిన ఉల్లి రైతుల దయనీయ పరిస్థితులను కూడా పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఉల్లిగడ్డలు సాగు చేసిన రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.