డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే.. | Fact Check: Tax On UPI Transactions Viral News Complete Details | Sakshi
Sakshi News home page

డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే..

Dec 16 2024 3:47 PM | Updated on Dec 16 2024 3:59 PM

Fact Check: Tax On UPI Transactions Viral News Complete Details

ఈరోజుల్లో జేబులో కరెన్సీ లేకున్నా.. ధైర్యంగా అడుగు బయటపెట్టొచ్చు!. బ్యాంక్‌ బ్యాలెన్స్‌, ఓ స్మార్ట్‌ఫోన్‌.. దానికి ఇంటర్నెట్‌ ఉంటే చాలూ!. మార్కెట్‌లో ఎక్కడికి వెళ్లినా సెకన్లలో పేమెంట్లు చకచకా చేసేయొచ్చు. రూపాయి దగ్గరి నుంచి మొదలుపెడితే.. పెద్ద పెద్ద అమౌంట్‌ల చెల్లింపులకు రకరకాల యాప్స్‌ను ఉపయోగిస్తున్నాం. అంతగా డిజిటల్‌ చెల్లింపులు మన జీవనంలో భాగమయ్యాయి. అయితే ఈ చెల్లింపులపై ట్యాక్స్‌ విధింపు సబబేనా?

.. ప్రస్తుతం దేశంలో చాలావరకు జనం డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. పల్లె నుంచి పట్నం దాకా అందరికీ ఇది అలవాటైంది. మార్కెట్‌లలోనే కాదు, గ్యాస్‌, కరెంట్‌.. అన్ని రకాల బిల్లుల చెల్లింపులకు వీటినే ఉపయోగిస్తున్నారు. కానీ, కేంద్రం ఇప్పుడు వీటిపై ట్యాక్స్‌ విధించబోతోందట. ప్రత్యేకించి యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(UPI) యాప్‌ల ద్వారా చెల్లింపులపైనే ఈ పన్ను విధింపు ఉండనుందట!. 

ఇక నుంచి ఫోన్‌ పే, గూగుల్‌పే, మరేయిత యూపీఐ యాప్‌ ద్వారాగానీ పేమెంట్‌ చేశారనుకోండి.. దానిపై ఎక్స్‌ట్రా ఛార్జీ వసూలు చేస్తారు. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలు కాబోతోంది. మీరూ వాటితోనే చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. 

ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. ఏ యూపీఐ యాప్‌ ద్వారా అయినా 2 వేల రూపాయలకు పైన అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే 1.1 శాతం టాక్స్ పడుతుందట. ఎవరికైనా 10 వేల రూపాయలు పంపిస్తే, ట్యాక్స్ రూపంలో 110 రూపాయలు కట్ అవుతుందని.. కొన్ని వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. కానీ,

ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వార్త మాత్రమే. ముఖ్యంగా వాట్సాప్‌ యూనివర్సిటీ నుంచి ఈ వార్త ఎక్కువగా సర్క్యులేట్‌ అవుతోంది. వీటిని అదనంగా.. కొందరు వీడియోలను యాడ్‌ చేస్తున్నారు. అయితే ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా ఈ ప్రచారంపై మీకు స్పష్టత ఇవ్వబోతున్నాం.

అదొక ఫేక్‌ వార్త. పైగా ఇలాంటి వార్తే 2023-24 బడ్జెట్ టైంలోనూ వైరల్‌ అయ్యింది. ఆ టైంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ వాలెట్లు, ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్.. PPIని ఉపయోగించి చేసే లావాదేవీలకు మాత్రమే ఈ టాక్స్ వర్తిస్తుంది. ‘కొత్త ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు PPI లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు’ అని స్పష్టం చేసింది. 

సాధారణ UPI పేమెంట్లకు, PPI పేమెంట్లకు మధ్య తేడాను అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ గందరగోళం నెలకొంటోంది. పైగా కొన్ని ప్రముఖ ఛానెల్స్‌, వెబ్‌సైట్లు ఎలాంటి ధృవీకరణ లేకుండా గుడ్డిగా.. డిజిటల్‌ పేమెంట్లపై బాదుడే బాదుడు అంటూ కథనాలు ఇచ్చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement