చెల్లి పెళ్లి సొమ్ముతో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి.. | Etawah Student Lost 5 Lakh Rupees | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: చెల్లి పెళ్లి సొమ్ముతో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి..

Jan 3 2024 12:51 PM | Updated on Jan 3 2024 3:23 PM

Etawah Student Lost 5 Lakh Rupees - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన ఒక బీఎస్సీ విద్యార్థి ఆన్‌లైన్ గేమ్‌ ఆడి సుమారు రూ.5.5 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆన్‌లైన్ గేమ్‌లో రూ. 5 లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు.

ఆన్‌లైన్ గేమ్‌లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న తర్వాత అతనిని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కిడ్నాప్‌ నాటకం ఆడి, తప్పుడు కథనాన్ని సృష్టించాడు. ఇటావా జిల్లాలోని ఫ్రెండ్స్‌ కాలనీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. బీఎస్సీ విద్యార్థి కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో.. కుటుంబసభ్యులు మందలింపుతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తేలింది.

బీఎస్సీ చదువుకుంటున్న తమ కుర్రాడు కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  సిటీ ఎస్పీ, సిటీ సీఓ దర్యాప్తు చేపట్టి ఆ విద్యార్థి ఆచూకీ తెలసుకున్నారు. ఆ కుర్రాడు తాను కిడ్రాప్‌ అయినట్లు నాటకం ఆడాడని ఇటావా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఈ కుర్రాడి సోదరి వివాహం జరగనుంది. ఈ నేపధ్యంలో కుటుంబ సభ్యులు అతని ఖాతాలో సుమారు రూ.5 లక్షలు జమ చేశారు. 

ఆన్‌లైన్ గేమ్‌ ఆడిన ఆ కుర్రాడు తన దగ్గరున్న సొమ్మునంతా పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ కుర్రాడిని తీవ్రంగా మందలించారు. దీంతో ఆ  కుర్రాడు తన సోదరుడు, ఒక బంధువు సహకారంతో కిడ్నాప్ డ్రామా ఆడాడు. 

జనవరి ఒకటిన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇటావా పరిధిలోని ఘూగల్‌పూర్‌లో ఉంటున్న ఆ కుర్రాడి బంధువు శివం యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బంధువు సంజీవ్‌కుమార్‌ యాదవ్‌ కుమారుడు అంకిత్‌ యాదవ్‌ను గుర్తుతెలియని దుండగులు కారులో కిడ్నాప్ చేశారని అతను తన మొబైల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘూఘల్‌పూర్‌కు చేరుకున్నారు. 

ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు అదనపు పోలీసు సూపరింటెండెంట్ మార్గదర్శకత్వంలో అంకిత్ యాదవ్‌ను వెదికేందుకు పోలీసుల బృందం ఏర్పాయ్యింది. వీరికి ఈ ఘటన అనుమానాస్పదంగా కనిపించడంతో శివమ్ యాదవ్, అతని కుటుంబ సభ్యులను పోలీసు బృందం విచారించింది. ఈ నేపధ్యంలో అంకిత్ యాదవ్‌ను వెదికి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement