ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. అగ్ర నేత రేణుక మృతి | Encounter In Chhattisgarh, Women Maoist Renuka Died | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. వరంగల్‌ అగ్ర నేత రేణుక మృతి

Mar 31 2025 3:19 PM | Updated on Mar 31 2025 4:19 PM

Encounter In Chhattisgarh, Women Maoist Renuka Died

రాయ్‌పూర్‌ : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతల్ని కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రెస్‌ టీమ్‌ ఇన్‌ఛార్జ్‌ మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక మరణించారు.  

దంతెవాడ- బీజాపూర్‌ బోర్డర్‌లో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో జవాన్లు దండకారణ్యంలో కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ- బీజాపూర్‌ బోర్డర్‌ తుపాకుల మోతతో దద్దరిల్లింది. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం భీకర ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతి మరణించినట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్‌ రాయ్‌ అధికారికంగా ప్రకటించారు. రేణుక తెలంగాణలోని వరంగల్ జిల్లా జనగామ నివాసి. ఆమె తలపై రూ.25లక్షల రివార్డ్‌ ఉన్నట్లు చెప్పారు. కాల్పుల అనంతరం, ఆటోమెటిక్‌ ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్‌తో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

కాగా, ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 135మంది మావోయిస్టులు మృతి చెందగా.. గతేడాది 219మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.  

ఈ ఏడాది జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్‌ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.

  • ఫిబ్రవరిలో బీజాపూర్‌ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు.  
  • బీజాపూర్‌-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో మార్చి 20వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు, ఓ డీఆర్‌జీ జవాన్‌ రాజు మరణించారు. అదే రోజున కాంకేర్‌ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
  • మావోయిస్టు రహిత భారత్‌ లక్ష్యంగా ఆపరేషన్ కగార్‌(Operation Kagar) పేరిట హోం మంత్రి అమిత్‌ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement