
ఛత్తీస్గఢ్: బీజాపూర్లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రత బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తెలుగు నేతలే టార్గెట్గా ఆపరేషన్ కొనసాగుతుంది. మూడో రోజు మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటన స్థలంలో రెండు ఏకే 47 రైఫిళ్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో మూడు రోజులుగా మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. భద్రత బలగాల హిట్ లిస్టులో తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతలు బండి ప్రకాష్, దామోదర్, మల్లోజుల వేణుగోపాల్, రామన్న, వాసుదేవరావు ఉన్నారు. మరోవైపు మావో కీలక నేతలు బండి ప్రకాష్ , దిలీప్లకు ప్రాణహాని ఉందని పౌర హక్కుల సంఘాల నేతలు అంటున్నారు.
ఎన్కౌంటర్ పేరుతో హతమార్చే ప్రమాదం ఉందని పౌర హక్కుల సంఘం నేతలు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు నంబాల కేశవరావు, సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ నెల 5 నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్ ఎస్పీ వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు సహా పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.
ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో సెర్చింగ్ జరుగుతుంది. పాము కాటు, తేనెటీగల దాడిలో కొందరు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్తో మరి కొందరు జవాన్లకు అస్వస్థతకు గురయ్యారు. బలగాల ఆపరేషన్ ముగిసిన తర్వాత సమగ్ర సమాచారం తెలియ చేస్తామని బీజాపూర్ ఎస్పీ పేర్కొన్నారు.