వచ్చేస్తోంది మన బాహుబలి | DRDO giving Agni-5 a devastating upgrade | Sakshi
Sakshi News home page

వచ్చేస్తోంది మన బాహుబలి

Jul 1 2025 5:35 AM | Updated on Jul 1 2025 5:35 AM

DRDO giving Agni-5 a devastating upgrade

అగ్ని–5 క్షిపణిని బంకర్‌ బస్టర్‌ బాంబుగా మార్చబోతున్న డీఆర్‌డీవో

7,500 కేజీల బాంబును మోసుకెళ్లేలా తయారీ

మ్యాక్‌20 స్పీడ్‌తో దూసుకెళ్లేలా డిజైన్‌

అభివృద్ధి దశలో రెండు వేరియంట్లు

న్యూఢిల్లీ: ఇరాన్‌లోని ఫోర్డో భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలపై అమెరికా వేల కేజీల బరువైన బంకర్‌ బస్టర్‌ బాంబులను పడేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తమ అమ్ముల పొదిలోనూ అలాంటి బాహుబలి బాంబులు ఆత్యావశ్యకమని భారత సైన్యం భావించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా రంగం సిద్ధంచేసిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది.

 అత్యంత శక్తివంతమైన అగ్ని–5 ఖండాంతర క్షిపణికి బంకర్‌ బస్టర్‌ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిస్సైల్‌ను మరింత ఆధునీకరిస్తున్నట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. ఆపరేషన్‌ సిందూర్‌ వేళ పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌లోని భూగర్భ అణుకేంద్రంపై భారత వాయుసేన బాంబులు పడేసిందన్న వార్తల నడుమ అధునాతన బంకర్‌ బస్టర్‌ బాంబు తయారీకి  ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. 

ఏకంగా 100 మీటర్లు నేలలోకి చొచ్చుకుపోయేలా..
అగ్ని–5 ఇంటర్‌కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌కు అత్యంత బరువైన వార్‌హెడ్‌ను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు డీఆర్‌డీవో తెలిపింది. తొలుత రెండు వేరియంట్లలో ఈ కొత్త మిస్సైల్‌ను తయారుచేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యంమీదకు జారవిడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్‌ చేస్తున్నారు. అవసరమైతే శత్రు భూగర్భ అణుకేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్‌–అమెరికా ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారత్‌ తలపోస్తోంది. 

అందులో భాగంగానే బంకర్‌ బస్టర్‌ బాంబులతో సంప్రదాయక క్షిపణులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. సాధారణంగా అగ్ని–5 క్షిపణి గరిష్టంగా 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధిస్తుంది. దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్తవేరియంట్‌లను సిద్ధంచేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7,500 కేజీల బరువైన బంకర్‌ బస్టర్‌ బాంబును దీనిని అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకుని పోయేలా కొత్తతరహా మెకానిజంతో దీనిని సిద్ధంచేస్తున్నారు. 

తక్కువ ఖర్చులో పని పూర్తయ్యేలా..
అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణు లు మోసుకెళ్లలేవు. వాటిని మోసేందుకు, లక్ష్యంపై జారవిడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్‌ రకంగా నార్త్‌రోప్‌ బీ–2 స్పిరిట్‌ బాంబర్‌లను అమెరికా సమకూర్చుకుంది. ఒక్కో స్పిరిట్‌ బాంబర్‌ విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనిని ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చి దాని ద్వారా బంకర్‌ బస్టర్‌ బాంబును రణక్షేత్రంలో పడేయాలని భారత్‌ భావిస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే తన అమ్ములపొదిలో ఉన్న అగ్ని–5ను ఈ కార్యం కోసం డీఆర్‌డీఓ ఎంచుకుంది. 

ఒకటి భూతలంపై.. మరోటి భూగర్భంలో..
రెండు వేరియంట్లలో ఒకటి భూతలం మీది లక్ష్యాలను చేధిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకుపోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాల్లేకుండా పేల్చేస్తుంది. మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లాన తర్వాతే పేలుతుంది. రెండు వేరియంట్లు గరిష్టంగా 8,000 కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధంచేయాలని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఇంతటి వేలకేజీల బరువైన బంకర్‌బస్టర్‌ బాంబులున్న దేశాల సరసన భారత్‌ నిలుస్తుంది. శత్రువుల కమాండ్‌–కంట్రోల్‌ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు. ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్తాన్, చైనాలను నిలువరించాలన్నా, వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బకొ ట్టాలన్నా భారత్‌కు ఇలాంటి భారీ బాంబుల అవసరం ఎంతైనా ఉందని డీఆర్‌డీఓ పేర్కొంది.

హైపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్లేలా...
ఎంత వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది. అందుకే అత్యధిక హైపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్లేలా ఈ రెండు వేరియంట్లను తయారుచేస్తున్నారు. భూతల లక్ష్యాలను చేధించే వేరియంట్‌ మ్యాక్‌8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ఛిద్రంచేసే వేరియంట్‌ మ్యాక్‌20 వేగంతో ప్రయాణించేలా డిజైన్‌ చేస్తున్నారు.

బంకర్‌ బస్టర్‌ 
ఉపయోగాలేంటి?సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కార్మాగారాలను భూస్థాపితం చేయాలంటే బంకర్‌ బస్టర్‌ బాంబుతోనే సాధ్యం. జీపీఎస్‌ ట్రాకింగ్, అతి వేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రంచేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటివైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనిని రక్షణంగా ఉంటుంది. యుద్ధక్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధట్యాంక్‌లు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సురక్షితంగా ఉంటారు. ఈ కంట్రోల్‌ సెంటర్‌ను నాశనంచేస్తే రణక్షేత్రంలోని బలగాలకు సరైన దిశానిర్దేశం కరువవుతుంది. దీంతో ఆ శత్రుబలగాలను నిలువరించడం భారత బలగాలకు తేలిక అవుతుంది. శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బాలిస్టిక్, క్రూయిజ్‌ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంఛర్‌ నుంచే దూసుకొస్తాయి. వీటిని భూస్థాపితం చేయాల న్నా బంకర్‌బస్టర్‌లు అవసరమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement