breaking news
modernization development
-
వచ్చేస్తోంది మన బాహుబలి
న్యూఢిల్లీ: ఇరాన్లోని ఫోర్డో భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలపై అమెరికా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులను పడేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తమ అమ్ముల పొదిలోనూ అలాంటి బాహుబలి బాంబులు ఆత్యావశ్యకమని భారత సైన్యం భావించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా రంగం సిద్ధంచేసిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన అగ్ని–5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిస్సైల్ను మరింత ఆధునీకరిస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్లోని కిరానా హిల్స్లోని భూగర్భ అణుకేంద్రంపై భారత వాయుసేన బాంబులు పడేసిందన్న వార్తల నడుమ అధునాతన బంకర్ బస్టర్ బాంబు తయారీకి ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. ఏకంగా 100 మీటర్లు నేలలోకి చొచ్చుకుపోయేలా..అగ్ని–5 ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్కు అత్యంత బరువైన వార్హెడ్ను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు డీఆర్డీవో తెలిపింది. తొలుత రెండు వేరియంట్లలో ఈ కొత్త మిస్సైల్ను తయారుచేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యంమీదకు జారవిడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అవసరమైతే శత్రు భూగర్భ అణుకేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్–అమెరికా ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారత్ తలపోస్తోంది. అందులో భాగంగానే బంకర్ బస్టర్ బాంబులతో సంప్రదాయక క్షిపణులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. సాధారణంగా అగ్ని–5 క్షిపణి గరిష్టంగా 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధిస్తుంది. దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్తవేరియంట్లను సిద్ధంచేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7,500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును దీనిని అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకుని పోయేలా కొత్తతరహా మెకానిజంతో దీనిని సిద్ధంచేస్తున్నారు. తక్కువ ఖర్చులో పని పూర్తయ్యేలా..అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణు లు మోసుకెళ్లలేవు. వాటిని మోసేందుకు, లక్ష్యంపై జారవిడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్ రకంగా నార్త్రోప్ బీ–2 స్పిరిట్ బాంబర్లను అమెరికా సమకూర్చుకుంది. ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనిని ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చి దాని ద్వారా బంకర్ బస్టర్ బాంబును రణక్షేత్రంలో పడేయాలని భారత్ భావిస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే తన అమ్ములపొదిలో ఉన్న అగ్ని–5ను ఈ కార్యం కోసం డీఆర్డీఓ ఎంచుకుంది. ఒకటి భూతలంపై.. మరోటి భూగర్భంలో..రెండు వేరియంట్లలో ఒకటి భూతలం మీది లక్ష్యాలను చేధిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకుపోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాల్లేకుండా పేల్చేస్తుంది. మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లాన తర్వాతే పేలుతుంది. రెండు వేరియంట్లు గరిష్టంగా 8,000 కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధంచేయాలని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఇంతటి వేలకేజీల బరువైన బంకర్బస్టర్ బాంబులున్న దేశాల సరసన భారత్ నిలుస్తుంది. శత్రువుల కమాండ్–కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు. ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్తాన్, చైనాలను నిలువరించాలన్నా, వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బకొ ట్టాలన్నా భారత్కు ఇలాంటి భారీ బాంబుల అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీఓ పేర్కొంది.హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా...ఎంత వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది. అందుకే అత్యధిక హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా ఈ రెండు వేరియంట్లను తయారుచేస్తున్నారు. భూతల లక్ష్యాలను చేధించే వేరియంట్ మ్యాక్8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ఛిద్రంచేసే వేరియంట్ మ్యాక్20 వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు.బంకర్ బస్టర్ ఉపయోగాలేంటి?సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కార్మాగారాలను భూస్థాపితం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం. జీపీఎస్ ట్రాకింగ్, అతి వేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రంచేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటివైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనిని రక్షణంగా ఉంటుంది. యుద్ధక్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధట్యాంక్లు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు. ఈ కంట్రోల్ సెంటర్ను నాశనంచేస్తే రణక్షేత్రంలోని బలగాలకు సరైన దిశానిర్దేశం కరువవుతుంది. దీంతో ఆ శత్రుబలగాలను నిలువరించడం భారత బలగాలకు తేలిక అవుతుంది. శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంఛర్ నుంచే దూసుకొస్తాయి. వీటిని భూస్థాపితం చేయాల న్నా బంకర్బస్టర్లు అవసరమే. -
ఎయిర్ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందికి త్వరలో కొత్త యూనిఫాం రానుంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యూనిఫామ్స్ను డిజైన్ చేయనున్నారు. 10,000లకుపైగా ఉన్న ఫ్లయిట్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ ఉద్యోగులు 2023 చివరినాటికి నూతన డ్రెస్లో దర్శనమీయనున్నారు. ఎయిర్ ఇండియాలో కొనసాగుతున్న ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఇది మరో అడుగు అని సంస్థ తెలిపింది. -
ప్రధాన కాలువ.. పారేదెలా!
నిజాంసాగర్, న్యూస్లైన్: నిజాంసాగర్ ప్రాజెక్టు చివరాయకట్టుకు సాగునీరు అందడం కలగానే మిగులుతోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రధాన కాలువ ఆధునికీకరణ పనుల్లో పురోగతి లేకపోవడమే ఇందుకు కారణంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. నిధులు ఉన్నా నిష్ర్పయోజనంగా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నిజాం కాలంలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ బలహీనంగా మారింది. కాలువ గట్టుకు ఏర్పాటు చేసిన బండరాళ్లు అక్కడక్కడా తొలగిపోయాయి. ప్రాజెక్టు నిర్మించిన సమయం లో 3 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా 155 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువను బలపర్చారు. అయితే ఎప్పటికప్పుడు సరైన మరమ్మతులు చేయని కారణంగా క్రమక్రమంగా కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 1,800 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కూడా తట్టుకోలేక పోతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట గండ్లు పడుతూ వేలాది ఎకరాలకు అందాల్సిన సాగు నీరు వృథా అవుతోంది. చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు చేరడం లేదు. ప్రధాన కాలువ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఆధునికీకరణ పనుల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008-09లో రూ. 549.5 కోట్లను మంజూరు చేశారు. ఆధునికీకరణ కోసం వచ్చిన నిధులను జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు 15 ప్యాకేజీలుగా విభజించారు. రెండు ప్యాకేజీలు మాత్రం ప్రాణహిత చేవెళ్ల పథకం పనుల్లోకి వెళ్లగా 13 ప్యాకేజీల్లో ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. అయితే పనులు అనుకున్నంత మేర సాగడం లేదు. అన్ని ప్యాకేజీల్లో ప్రధాన కాలువకు సిమెంట్ లైనింగ్ చేయాల్సి ఉంది. కాగా 1,2, ప్యాకేజీలతో పాటు మరికొన్ని ప్యాకేజీల్లో సిమెంట్ లైనింగ్ పనులు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఆయా ప్యాకేజీల్లో కట్టబలోపేతం, ముళ్ల పొదల తొలగింపు పనులు ఆసంపూర్తిగానే ఉన్నాయి. మిగతా ప్యాకేజీల్లో సుమారు 4 నుంచి 6 కిలోమీటర్ల మేర సిమెంట్ లైనింగ్ పనులు మాత్రం జరిగాయి. ఆయా ప్యాకేజీల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు మాత్రం రూ. 250 కోట్ల మేర డబ్బులు చెల్లించారు. ఇదిలా ఉండగా ప్రస్తుత రబీ సీజన్లో చివరి ఆయకట్టు వరకు రైతన్నలు పంటల సాగు కోసం సమాయత్తమవుతున్నారు. ప్రధాన కాలువ మొదటి ఆయకట్టు ప్రాంతంలో పటిష్టంగా లేకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరందడం కష్టంగా మారనుంది.