కన్నడ సమ్రాట్‌ డీకే శివకుమార్‌ | DK Shivakumar sworn in as 25th Chief Minister of Karnataka | Sakshi
Sakshi News home page

కన్నడ సమ్రాట్‌ డీకే శివకుమార్‌

Jun 4 2026 5:24 AM | Updated on Jun 4 2026 5:25 AM

DK Shivakumar sworn in as 25th Chief Minister of Karnataka

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం  

లోక్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన వేడుక

13 మంది మంత్రుల ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా జి.పరమేశ్వర  

డీకేఎస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు  

సుసంపన్నమైన కర్ణాటకను నిర్మించడానికి చేతులు కలపాలి  

ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజలకు డీకే శివకుమార్‌ పిలుపు  

సాక్షి బెంగళూరు: కర్ణాటకలో అధికార మార్పిడి సజావుగా పూర్తయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ట్రబుల్‌ షూటర్, కింగ్‌ మేకర్‌ డీకే శివకుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. బెంగళూరులోని లోక్‌భవన్‌ గ్లాస్‌హౌజ్‌లో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు నూతన సీఎంగా డీకే శివకుమార్‌తో రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 

మరో 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. హోంశాఖ మాజీ మంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. కేబినెట్‌లో చోటు దక్కడంతో స్పీకర్‌ యూటీ ఖాదర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు అదిచుంచనగిరి మఠాధిపతి డాక్టర్‌ శ్రీ నిర్మలానందనాథ స్వామీజీతోపాటు పలువురు మఠాధిపతుల ఆశీస్సులను డీకే శివకుమార్‌ స్వీకరించారు.  

తొలి కేబినెట్‌ సమావేశం  
కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం డీకే శివకుమార్‌ విధానసౌధ ప్రాంగణానికి చేరుకున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, బసవణ్ణ, మహాత్మ గాంధీతోపాటు పలువురు మహనీయుల విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధానసౌధ ఆవరణలో ఉన్న మునేశ్వర దేవస్థానంలో పూజలు చేశారు. తర్వాత విధానసౌధ మెట్లకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఉత్తరనంది ద్వారం గుండా విధానసౌధలోకి  ప్రవేశించారు. అనంతరం నూతన మంత్రులతో మొదటి కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకార వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన డీకే  
ప్రమాణ స్వీకారంలో డీకే శివకుమార్‌ సంప్రదాయ వస్త్రధారణ అందరినీ ఆకట్టుకుంది. పట్టు పంచ, పట్టు జుబ్బా, శాలువా ధరించారు. భారత రాజ్యాంగాన్ని చేతబూని వీరగంగాధర అజ్జయ్య పేరుతో  ప్రమాణ స్వీకారం చేశారు. వేదికపై అజ్జయ్య చిత్రపటానికి నమస్కరించారు.  అంతకంటే ముందు తనకు సీఎంగా అవకాశం కల్పించిన కర్ణాటక ప్రజలకు వేదికపై సాష్టాంగ నమస్కారం చేశారు.   

సీఎం కార్యాలయానికి మార్పులు  
డీకే శివకుమార్‌ ప్రమాణం చేయటానికి ముందే విధానసౌధలోని కార్యాలయంలో వాస్తు ప్రకారం సీఎం సీటును అధికారులు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికమైన మార్పులు సైతం చేశారు. సీఎం ఆఫీసును ప్రఖ్యాత జ్యోతిషులు, వాస్తు నిపుణుల బృందం సూక్ష్మంగా పరిశీలించింది. డీకే శివకుమార్‌ కుర్చీ స్థానాన్ని వాస్తుకు అనుగుణంగా మార్పు చేశారు. సీఎం గదిలో డీకే శివకుమార్‌కు ఇష్టమైన నోణవినకెరె అజ్జయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.  

హాజరైన ప్రముఖులు  
ప్రమాణ స్వీకార వేడుకకు కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలాతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం సతీశన్, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఠాకూర్‌ సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, బీకే హరిప్రసాద్, తెలంగాణ మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, మొహమ్మద్‌ అజారుద్దీన్‌ తదితరులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు తరలివచ్చారు.    

దేవెగౌడ, యడ్యూరప్పతో భేటీ  
డీకే శివకుమార్‌ బుధవారం ఉదయం విపక్ష నాయకులతో భేటీ కావడం ఆసక్తి రేపింది. మాజీ ప్రధాని, జేడీ(ఎస్‌) పార్టీ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూప్పను కలుసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ప్రభుత్వ పరిపాలన నిర్వహణలో వారి సలహాలు, సూచనలు కోరినట్లు డీకే తెలిపారు. అలాగే కనకపురలో నివసిస్తున్న తన తల్లి గౌరమ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. 

ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత  డీకే శివకుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ‘ఎక్స్‌’లో శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల పురోగతి, సంక్షేమం కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తారన్న నమ్మకం తమకు ఉందని భార్య ఉష, కుమార్తె ఐశ్వర్య పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలకు సేవ చేయడంలో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.  

సిద్ధరామయ్య కుమారుడికి మంత్రి పదవి
మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డీకే శివకుమార్‌ మంత్రివర్గంలో చోటు దక్కింది. కేహెచ్‌ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్‌ జార్కిహొళి, కృష్ణ బైరేగౌడ, బైరతి సురేశ్, శరణ ప్రకాష్ పాటిల్, ఈశ్వర్‌ ఖండ్రే, ప్రియాంక్‌ ఖర్గే మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరందరూ గత కేబినెట్‌లో మంత్రులే. కొత్తగా యూటీ ఖాదర్, యతీంద్ర మంత్రులయ్యారు. సీఎం డీకే శివకుమార్‌ కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగారు.   

అది పవిత్రమైన బాధ్యత  
ముఖ్యమంత్రి పదవి కేవలం రాజ్యాంగబద్ధమైన పదవి మాత్రమే కాదని.. అది రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన ఒక పవిత్రమైన బాధ్యత అని తనకు పూర్తి అవగాహన ఉన్నట్లు సీఎం డీకే శివకుమార్‌ చెప్పారు. మునుపెన్నడూ లేనంత కరుణామయమైన, సమానత్వంతో కూడిన, సుసంపన్నమైన కర్ణాటకను నిర్మించడానికి ప్రజలందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. మన భవిష్యత్‌ తరాలు గర్వపడేలా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. 

ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘ఈ క్షణం కేవలం నాది మాత్రమే కాదు. కర్ణాటక ప్రజలది. నా ప్రయాణంలోని ప్రతి సవాలులో, ప్రతి మైలురాయిలో నాకు మార్గనిర్దేశం చేసిన లక్షలాది అంకితభావం గల కార్యకర్తలది కూడా. ఎన్నో ఒడిదుడుకులలో వారే నా బలం, నా స్ఫూర్తి. నన్ను నమ్మి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కోట్లాది కన్నడిగుల ఆశలు, ఆకాంక్షలు, కలలను నెరవేర్చడానికి అవిశ్రాంతంగా కృషి చేయాల్సిన బాధ్యత నా భుజాలపై ఉంది. 

నా సీనియర్లకు, గురువులకు, మార్గనిర్దేశం చేసి, ప్రోత్సహించి, పట్టుదలతో ముందుకు సాగేందుకు బలాన్నిచ్చిన వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటా. కర్ణాటక ఎల్లప్పుడూ అవకాశాలు, ఆవిష్కరణలు, పురోగతికి ఒక కేంద్రస్థానంగా నిలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో తదుపరి అధ్యాయాన్ని లిఖించడంలో ప్రతి రైతు, కార్మికుడు, పారిశ్రామికవేత్త, మహిళ, విద్యార్థి, యువత కీలక పాత్ర పోషించాలి. 

మనం మరింత బలమైన, సుసంపన్నమైన, సమ్మిళిత భవిష్యత్తును నిర్మించడానికి నూతన ఆలోచనలు, సాంకేతికత, సామూహిక శక్తిని ఉపయోగించుకోవాలి. ఏ ఒక్క నాయకుడూ ఒంటరిగా మార్పును తీసుకురాలేడు. ప్రజలందరూ ఒకే దృక్పథంతో, ఉమ్మడి లక్ష్యంతో ఏకమైనప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. మనం కలిసి నడిస్తే.. చేరుకోలేని లక్ష్యం గానీ, అధిగమించలేని సవాలు గానీ ఉండదు’’ అని డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement