తమిళనాడు దిండుక్కల్ జిల్లా నత్తం సమీపంలోని వేలాయుధంపట్టికి చెందిన అరవిందన్ (22) కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మితో అతడు గతంలో సన్నిహితంగా మాట్లాడేవాడు. అయితే మూడు నెలల క్రితం నాగలక్ష్మికి సిరుమలై తాళకడై ప్రాంతానికి చెందిన వీరమణి (24)తో వివాహమైంది.
వివాహం అనంతరం కూడా అరవిందన్ నాగలక్ష్మికి తరచూ ఫోన్ సందేశాలు పంపుతూ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నాగలక్ష్మి, తనకు పెళ్లైందని, ఇకపై ఇలాంటి సందేశాలు పంపవద్దని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆమె తన భర్త వీరమణికి కూడా తెలిపింది. అయినప్పటికీ అరవిందన్ తన ప్రవర్తన మార్చుకోలేదు.
దీంతో నాగలక్ష్మి పేరుతో వీరమణి అరవిందన్కు సిరుమలైకి రావాలని సందేశం పంపినట్లు సమాచారం. నాగలక్ష్మిని కలుసుకోవచ్చన్న ఉద్దేశంతో అరవిందన్ అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా వీరమణి, "నా భార్యను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు" అంటూ అరవిందన్తో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో వీరమణి కత్తితో దాడి చేసి అరవిందన్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో వీరమణి మృతదేహాన్ని ఇంటి సమీపంలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. అనంతరం చెత్తతో కప్పి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ విషయాన్ని వీరమణి తన స్నేహితుడికి చెప్పగా, అతడు గ్రామ పెద్దలకు సమాచారం అందించాడు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ డీఎస్పీ శంకర్, ఇన్స్పెక్టర్ ఉలగనాథన్ నేతృత్వంలోని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.
అరవిందన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దిండుక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


