రాహుల్‌ ‘ఫిక్సింగ్‌’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్‌ కౌంటర్‌ ఆర్టికల్‌ | Devendra Fadnavis Responds to Rahul Gandhi's Comments | Sakshi
Sakshi News home page

రాహుల్‌ ‘ఫిక్సింగ్‌’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్‌ కౌంటర్‌ ఆర్టికల్‌

Jun 8 2025 12:26 PM | Updated on Jun 8 2025 12:35 PM

Devendra Fadnavis Responds to Rahul Gandhi's Comments

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో(2024)మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఒక ప్రముఖ పత్రికలో వ్యాసం రాశారు.  దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, రాహుల్‌ ఆర్టికల్‌కు కౌంటర్‌గా మరో పత్రికలో వ్యాసం రాశారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లోని శరద్ పవార్ వర్గం, శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గాల కూటమి ఊహించని ఓటమిని చవిచూసిందని పేర్కొంటూ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విధానాన్ని రాహుల్‌ గాంధీ తప్పుపట్టారు. దీనిపై ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’లో వ్యాసం రాశారు.

దీనికి కౌంటర్‌గా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాసిన వ్యాసం నేడు(ఆదివారం)ఒక మరాఠీ దినపత్రికలో ప్రచురితమయ్యింది. దానిలో ఫడ్నవీస్‌ కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని, అందుకే వారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లను తప్పుబడుతూ, ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. రాహుల్‌ గాంధీ వైఫల్యాన్ని అంగీకరించలేని నేత అని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు సరైనవేనా? అంటూ ఫడ్నవీస్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్‌సీపీలోని శరద్ పవార్ వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేనల మహా వికాస్ అఘాడి కూటమి నవంబర్ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 46 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అప్పటి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ, బీజేపీల మహాయుతి కూటమి 235 సీట్లను గెలుచుకుంది. బీజేపీ ఒంటరిగా 132 సీట్లను గెలుచుకుంది. ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డుగా నిలిచింది.

ఇది కూడా చదవండి: భగ్గుమన్న మణిపూర్‌.. ఏటీ నేత అరెస్టుతో ఉద్రిక్తత
 

Advertisement
 
Advertisement
Advertisement