సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల అమలులో అర్హుల ఎంపిక, ప్రభుత్వాల బాధ్యతపై కోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. శుక్రవారం ఒక కేసు విచారణ సందర్భంగా.. కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని వ్యాఖ్యానించింది.
రైతుల కోసం అమలు చేసిన రైతుబంధు వంటి పథకాలలోనూ సంపన్నులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. నిజంగా అవసరం ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. భవిష్యత్ తరాలకు ప్రభుత్వాలు ఏం మిగులుస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
“ఒకప్పుడు దేశానికి ఏం ఇచ్చామా? అని ఆలోచించేవాళ్లం.. ఇప్పుడు దేశం మనకేం ఇచ్చిందని అడుగుతున్నాం” అంటూ సామాజిక బాధ్యతపై కోర్టు వ్యాఖ్యలు చేసింది.
చదువుకు సాయం.. అర్హులకు సంక్షేమం
ప్రభుత్వ నిధులు సరైన దిశలో వినియోగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. బాగా చదువుకునే విద్యార్థులకు ఫీజులు, నిజంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని సూచించింది.
1.15 కోట్ల మందికి పథకాలు.. ప్రభుత్వ నిర్వహణ ఎలా?
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉచిత పథకాలు అందిస్తే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. 1.15 కోట్ల మందికి ఉచిత పథకాలు ఇస్తున్నప్పుడు భవిష్యత్లో ప్రభుత్వాలు వాటిని ఎలా కొనసాగిస్తాయనే ప్రశ్నను లేవనెత్తింది.
సంక్షేమ పథకాలు ప్రజలకు అండగా ఉండాల్సినవేనని, అయితే వాటి అమలులో పారదర్శకత, అర్హత ప్రమాణాలు కీలకమని హైకోర్టు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా ధనం సద్వినియోగం కావాలంటే అవసరమైన వారికి మాత్రమే ప్రయోజనాలు చేరేలా విధానాలు ఉండాలని సూచించింది.


