ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన ప్రగతి సమీక్షలో అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సేవలందించడం, డిజిటల్ ప్లాట్ఫారాల సమర్థ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) గురువారం నిర్వహించిన ప్రగతి జాతీయ స్థాయి సమీక్షలో సైబర్ క్రైమ్ పనితీరుకు సంబంధించిన తొమ్మిది కీలకాంశాల్లో తెలంగాణకు దేశంలోనే మొదటి ర్యాంకు లభించింది.
దేశవ్యాప్తంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసేందుకు నిర్వహించిన ఈ సమీక్షలో ఎస్4సీ ఏర్పాటు, ఈ–జీరో ఎఫ్ఐఆర్ అమలు, గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం, మనీ రెస్టోరేషన్ మాడ్యూల్, సహయోగ్ పోర్టల్, సమన్వయ పోర్టల్ వినియోగం, సైబర్ హాట్స్పాట్ల గుర్తింపు, పోలీసులకు సామర్థ్యాభివృద్ధి, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు వంటి తొమ్మిది అంశాలను పరిశీలించారు. ఈ విభాగాల్లో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. కాగా, జాతీయ స్థాయిలో తెలంగాణ మొదటి స్థానం సాధించడంపై సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బందిని అభినందించారు.
జీఆర్ఎంలో 88 శాతం పరిష్కారం..
బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, అన్ఫ్రీజ్, డెబిట్ హోల్డ్ లకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం రూపొందించిన జీఆర్ఎం (గ్రీవెన్స్ రెడ్రెస ల్ మెకానిజం) పోర్టల్లో ఆగస్టు 2 నాటికి 2,368 దరఖాస్తులు నమోదు కాగా, వాటిలో 2,086 కేసుల్లో చర్యలు తీసుకుని 88 శాతం పరిష్కారం సాధించినట్లు వెల్లడైంది.అదేవిధంగా ఎంఆర్ఎం (మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ ) ద్వారా ఆగస్టు 2 నాటికి 34,524 కేసుల్లో రూ.16.42 కోట్ల మేర బాధితులకు తిరిగి చెల్లించదగిన మొత్తాన్ని గుర్తించారు. ఇందులో 81.38 శాతం కేసుల్లో పోలీసుల ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.50 వేల వరకు కోర్టు ఉత్తర్వులు లేకుండానే నిబంధనల మేరకు బాధితులకు సొమ్ము తిరిగి అందించే విధానం అమల్లో ఉందని అధికారులు తెలిపారు.


