
ఇంఫాల్/గౌహతి/న్యూఢిల్లీ: మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొందరు యువకులు బృందంగా ఏర్పడి, తాము పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుంటామని బెదిరింపులకు దిగారు. వీరు మెయిటీ కమ్యూనిటీకి చెందిన అరంబై టెంగోల్ (ఏటీ) సంస్థ కీలక నేత కనన్ సింగ్ను పోలీసులు అరెస్టు చేయడంతో నిరసనలకు దిగారు. కనన్ సింగ్ మెయిటీ, కుకీ జాతి ఘర్షణల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
భద్రతా దళాలు ఏటీ నేత కనన్ సింగ్ను అరెస్టు చేసిన దరిమిలా ఇంఫాల్లో శనివారం రాత్రి నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు రోడ్డుపై టైర్లు తగలబెట్టి రోడ్లను దిగ్బంధించారు. ఆ సమయంలో కాల్పుల శబ్దం కూడా వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. నల్లని టీ-షర్టులు ధరించిన యువకుల బృందం పెట్రోల్ బాటిళ్లతో రోడ్లపై నిరసనకు దిగింది. 2024 ఫిబ్రవరిలో జరిగిన అదనపు పోలీసు సూపరింటెండెంట్ మోయిరంగ్థెం అమిత్ ఇంటిపై దాడి , ఒక సీనియర్ పోలీసు అధికారి కిడ్నాప్లో కనన్ సింగ్ ప్రధాన నిందితుడు. అప్పుడు అతను రాష్ట్ర పోలీసు కమాండో యూనిట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. విధులలో నిర్లక్ష్యం కారణంగా అప్పట్లో అతనిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కనన్ సింగ్ ఏఐలో భాగస్వామిగా మారాడు.
నిందితుడు కనన్ సింగ్ తిరుగుబాటు గ్రూపు కుకి నేషనల్ ఆర్మీ (కేఎన్ఏ)లో కీలకంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా ఏటీ అనేది కుకీ గ్రామాలపై దాడులకు దిగుతున్న రాడికల్ మెయిటీ మిలీషియా అని కుకీ తెగలు ఆరోపిస్తున్నాయి. పోలీసు ఆయుధాల దోపిడీ కేసుల్లో పలువురు ఏటీ సభ్యులు కూడా ఉన్నారు. కాగా కుకీ, జోమి, హ్మార్ తెగలు పలు తిరుగుబాటు గ్రూపులలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ తెగలకు చెందిన వారిలో చాలామంది మణిపూర్ హింసలో పాల్గొన్నారనే ఆరోపణలున్నాయి. గతంలో చోటుచేసుకున్న మణిపూర్ హింసాయుత ఘటనల్లో 260 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. 50 వేలమంది నిరాశ్రయులయ్యారు.
ఇది కూడా చదవండి: ‘డెమోక్రాట్లకు నిధులిస్తే బాగోదు’.. మస్క్కు ట్రంప్ వార్నింగ్