పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వరుసగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల నుంచి చిన్న ఊరట దక్కింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఒక్కో కమర్షియల్ సిలిండర్పై రూ.183.50 తగ్గాయి. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులకు.. అలాగే పరోక్షంగా సామాన్యులకు కొంత ఉపశమనం లభించనుంది.
ఇటీవల ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడింది. దీంతో గత కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పలుమార్లు పెరిగాయి. మే నెలలో ఒకేసారి భారీ పెంపు, ఆ తర్వాత జూన్లో మరోసారి పెరుగుదలతో వ్యాపార వర్గాలపై అదనపు భారం పడింది.
తాజాగా పరిస్థితులు క్రమంగా మెరుగుపడటంతో ప్రభుత్వం ధరలను తగ్గించింది. అలాగే కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను యుద్ధానికి ముందు స్థాయికి పునరుద్ధరించింది.
ప్రధాన నగరాల్లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ తాజా ధరలు
ఢిల్లీ రూ.2,930, హైదరాబాద్ రూ.3,178, విజయవాడ రూ.3,115
అయితే ఈ తగ్గింపు కేవలం 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లకే వర్తిస్తుంది. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ఎల్పీజీ బెంచ్మార్క్లు, దిగుమతి వ్యయం, రవాణా ఖర్చుల ఆధారంగా నిర్ణయించబడతాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.


