(ఫైల్ ఫోటో)
ఢిల్లీ: వచ్చే నెల ( సెప్టెంబర్) ఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రధానితో ప్రత్యేక భేటీ సైతం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిన్పింగ్ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
2020లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. ఇరుదేశాలు సరిహద్దులో భారీగా సైన్యాన్ని, ఆయుధాలను మోహరించాయి. దానితో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంతో చైనా తరచుగా కయ్యానికి కాలు దువ్వడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు భారత్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరుకానున్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. అంతేకాకుండా ఈ సారి ఆయన బృందంలో సుమారు 400 మంది అధికారులు ఉండవచ్చని తెలుస్తోంది. చివరిసారిగా 2019లో షీ జిన్పింగ్ చివరిసారిగా భారత్కు వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చిన అధికారుల సంఖ్యతో పోలిస్తే ఇది రెండింతల కంటే ఎక్కువ.
ఒక భారతీయ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం చైనా అధికారులు హోటళ్లు, ఇతర భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ప్రోటోకాల్స్ను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాట్లు తెలిపారు. అయితే, షీ జిన్పింగ్ తుది ప్రయాణ వివరాలను చైనా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే భారత్-చైనా మధ్య ఆయనకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్య జరిగే అవకాశం ఉన్న ద్వైపాక్షిక సమావేశంపై సైతం ఇంకా తుది ప్రకటన రాలేదు.
సరిహద్దు చర్చలకు ప్రాధాన్యత
కాగా షీ జిన్పింగ్ భారత్ పర్యటనపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలోనే, భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు.మంగళవారం దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సరిహద్దు సమస్యలు, భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన విస్తృత అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.


