నీట్‌ లీకేజీ కీలక సూత్రధారి ‘రాకీ’ అరెస్ట్‌ | CBI Arrest NEET UG Paper Leak Case Mastermind | Sakshi
Sakshi News home page

NEET-UG paper leak case: నీట్‌ లీక్‌ వ్యవహారం.. మాస్టర్‌ మైండ్‌ ‘రాకీ’ అరెస్ట్‌!

Jul 11 2024 7:57 PM | Updated on Jul 12 2024 9:56 AM

CBI Arrest NEET UG Paper Leak Case Mastermind

ఢిల్లీ: నీట్‌-యూజీ (2024) పరీక్ష పత్రం లీక్‌ కేసు సీబీఐ దర్యాప్తులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక సూత్రధారిగా భావిస్తోన్న రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ రాకీ అనే వ్యక్తిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. గురువారం మధ్యాహ్నం పాట్నాలో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ.. విచారించేందుకు స్థానిక కోర్టు అనుమతితో 10 రోజుల కస్టడీకి తీసుకుంది.

మరోవైపు పాట్నాతో పాటు కోల్‌కతా (పశ్చిమ బెంగాల్‌)లోని పలు ప్రాంతాల్లో నిర్వహించాయి. అంతేకాదు.. ఈ నేరానికి సంబంధించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.  రాకీతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసింది. 

సీబీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మే 5వ తేదీన పరీక్ష జరిగింది. అయితే అంతకంటే రెండురోజుల ముందే హజారీబాగ్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో పేపర్లను భద్రపరిచారు. అక్కడి నుంచి రెండు సెట్ల పేపర్లు స్థానిక పరీక్ష కేంద్రం అయిన ఒయాసిస్‌ స్కూల్‌కు చేరాయి. అయితే స్కూల్‌కు చేరే క్రమంలోనే వాటి సీల్స్ తెరుచుకుని.. పేపర్‌ లీక్‌ అయ్యింది.

జార్ఖండ్‌లోని హజారిబాగ్‌ పాఠశాల నుంచి నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యి ఉండొచ్చని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడి నుంచే బీహార్‌ పాట్నా సెంటర్‌లకు చేరి ఉండొచ్చని చెబుతోంది. ఈ క్రమంలో బుధవారం ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ను సైతం అరెస్ట్‌ చేసింది. 

ప్రశ్నాపత్రాల సీల్‌ తొలగించిన టైంలో రాకీ అక్కడే ఉన్నాడు. తన ఫోన్‌తో వాటిని ఫొటోలు తీసి.. సాల్వర్‌ గ్యాంగ్స్‌ పేరిట ముఠాకు షేర్‌ చేశాడు. ఆ గ్యాంగ్‌ రెండు దశాబ్దాలుగా పోటీ పరీక్షల పేపర్లను లీక్‌ చేస్తూ వస్తోంది. రాకీ చేరవేసిన నీట్‌ ప్రశ్నాపత్రాల్ని.. అభ్యర్థుల నుంచి లక్షల సొమ్ము తీసుకుని పేపర్‌ను లీక్‌ చేసింది.  ఈ ముఠాలో మరో వ్యక్తి, రాకీకి సన్నిహితుడైన సంజీవ్‌ ముఖియా పరారీలో ఉన్నాడు. అయితే.. 

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ స్థానికంగానే జరిగిందని, కొందరు విద్యార్థులకే ప్రశ్నాపత్రం చేరిందని, భారీ ఎత్తున పేపర్‌ లీకేజీ జరగలేదని కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. కానీ, రాకీ అరెస్ట్‌.. అతన్ని విచారిస్తే లీకేజీ ఏ స్థాయిలో జరిగిందో తేలే అవకాశం ఉంది. 

దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బీహార్‌లో మూడు కేసులతో పాటు ప్రత్యేకంగా మరో ఆరు కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో నీట్‌ తరహాలో ఇతర పోటీ పరీక్షల పేపర్లను లీక్‌ చేసిన గ్యాంగ్‌ల గుట్టు వీడుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement