లక్నో: వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కావాల్సిన బ్యాగ్స్,బుక్స్, పెన్నులు కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్టేషనరీ షాపులకు క్యూకట్టారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీస్శాఖ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసింది. స్టేషనరీ షాపుల్లో కొనుగోలు చేసే పెన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
పెన్నుల్లా కనిపించేవన్నీ పెన్నులు కాదని.. సంఘ విద్రోహ శక్తులు పెన్నులకు బదులు..వాటి ఆకారంలో ఉండే బాంబుల్ని తయారు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని విడుదల చేసింది.
ఉత్తరప్రదేశ్లో పెన్ ఆకారంలో ఉన్న అనుమానాస్పద వస్తువులపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బులంద్షహర్ జిల్లా పోలీసులు (ఖుర్జా పోలీస్ స్టేషన్ పరిధి) ఈ అడ్వైజరీని విడుదల చేశారు. పెన్లా కనిపించే అనుమానాస్పద వస్తువులను తాకరాదని ప్రత్యేక సూచనలు చేశారు. ఇవి విస్ఫోటక పరికరాలుగా మార్పిడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ప్రజలు రోడ్లపై, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో లేదా ఎడారిలాంటి ప్రాంతాల్లో కనిపించే వస్తువులను తాకకుండా 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారం అత్యంత కీలకమని, శిక్షణ పొందిన భద్రతా సిబ్బందే ఇలాంటి వస్తువులను పరిశీలించాని తెలిపారు. ప్రజలు సూచనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.


