శ్రీకాకుళం: రెండేళ్లుగా నిత్యం మద్యం సేవించి వస్తున్న మాస్టారు మాకు వద్దు అంటూ విద్యార్థులు, స్థానికులు బుధవారం గార మండలం అంబళ్లవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుడు నీలాపు రామారావు గతంలో మద్యం మత్తులో ఉండటంతో స్థానికులు ఎంఈవో, డీఈఓలకు ఫిర్యాదు చేశారు. అయినా తీరు మారకపోవడంతో రెండేళ్ల కిందట ఎంఈఓకి రెడ్హ్యాండెడ్గా పాఠశాలలోనే పట్టుబడటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.
అయితే టీడీపీ నాయకుల సిఫారసులతో మరలా అదే స్కూల్ టీచర్గా కొనసాగిస్తున్నారు. మరలా మద్యం మత్తులో రావడంతో పలుమార్లు ఎంఈఓ నక్క రామకృష్ణకు తెలిపినా రాజకీయ జోక్యంతో చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం 18 మంది విద్యార్థులు, మాజీ సర్పంచ్ అరవల రామారావు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద ధర్నా చేపట్టారు. ఎంఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయుడిపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు.


