తొలిసారి లోక్‌సభకు జేపీ నడ్డా పోటీ? | BJP Plans To Send JP Nadda To Lok Sabha | Sakshi
Sakshi News home page

Lok Sabha Election: తొలిసారి లోక్‌సభకు జేపీ నడ్డా పోటీ?

Jan 4 2024 7:41 AM | Updated on Jan 4 2024 8:48 AM

BJP Plans to Send JP Nadda to Lok Sabha - Sakshi

లోక్‌సభ ఎన్నికల బరిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు రాజ్యసభ సభ్యులు కనిపించనున్నారు. సీనియర్‌ నేతలను వారి సొంత రాష్ట్రాల నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ నిర్ణయించిందని సమాచారం. 

బీజేపీ సీనియర్‌ నేత జేపీ నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నడ్డా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా జేపీ నడ్డా రాజ్యసభలో రెండోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. రాజ్యసభకు చెందిన సీనియర్‌ నేతలను రంగంలోకి దించితే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట.  

దానికి ప్రధాన కారణం ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో పలువురు సీనియర్ నేతలు రాజ్యసభ సభ్యులగా ఉన్నారు. ఈ విషయాన్ని పలువురు మంత్రులు, ఎంపీలు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. కాగా రాజ్యసభ సభ్యునిగా ఒక నేతకు రెండు పర్యాయాలకు మించి అవకాశం ఇవ్వకూడదనే విధానాన్ని పార్టీ రూపొందించింది. ఈ విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. నడ్డా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ విధానాన్ని కొనసాగించినట్లవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నడ్డా రెండవసారి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది.

ఇదిలావుండగా న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు మంత్రులు ఆకాంక్షిస్తున్నారు. అయితే పార్టీలోని సీనియర్‌ నేతలను, మంత్రులను వారి సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలని నాయకత్వం అనుకుంటోంది. అప్పుడే ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement