‘నీట్‌’లో అక్రమాల ఆరోపణలు.. | Bihar Police recover 6 post-dated cheques for question paper facilitators | Sakshi
Sakshi News home page

‘నీట్‌’లో అక్రమాల ఆరోపణలు..

Jun 17 2024 5:55 AM | Updated on Jun 17 2024 5:55 AM

Bihar Police recover 6 post-dated cheques for question paper facilitators

బిహార్‌ పోలీసుల దర్యాప్తు వేగవంతం

ప్రశ్నపత్రం లీక్‌ చేసిన వారి వద్ద ఆరు చెక్కులు స్వాధీనం

పట్నా: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బిహార్‌ పోలీసుల దర్యాప్తు మరింత పురోగతి సాధించింది. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న బిహార్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) పోలీసులు ఆరు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలు డిమాండ్‌ చేసిన మాఫియా ముఠా సభ్యులకు చెందాల్సినవిగా వీటిని భావిస్తున్నామని ఈఓయూ డీఐజీ మానవ్‌జీత్‌ సింగ్‌ ధిల్లాన్‌ ఆదివారం చెప్పారు. 

సంబంధిత బ్యాంకుల నుంచి ఆయా ఖాతాదారుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా, పట్నాలో ప్రశ్నాపత్రాన్ని, జవాబులను అభ్యర్థులకు మాఫియా సభ్యులు వెల్లడించిన ఇంట్లో పాక్షికంగా కాల్చివేసిన ప్రశ్నాపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

 ఎన్‌టీఏ నుంచి రిఫరెన్స్‌ ప్రశ్నాపత్రం కోరామని, అది అందాక రెండింటిని సరిపోల్చుతామని డీఐజీ చెప్పారు. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో 9 మంది అభ్యర్థులతోపాటు నలుగురు ఎగ్జామినర్లున్నారు. వీరంతా బిహారీలే. అదేవిధంగా, ఈ లీకేజీ వ్యవహారంతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న బిహార్‌కే చెందిన మరో ఏడుగురు, యూపీ, మహారాష్ట్రలకు చెందిన ఓక్కో అభ్యర్థికి కూడా పోలీసులు నోటీసులు పంపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement