బెంగళూరు: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అధికారులమంటూ ఏటీఎం కరెన్సీ వ్యాన్ సిబ్బందిని నమ్మించి ఏకంగా రూ.7.11 కోట్ల కరెన్సీ కట్టలను దోచుకెళ్లిన ఉదంతం కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే చోటుచేసుకుంది. బుధవారం మధాŠయ్హ్నం 12.24 గంటలకు జేపీ నగర్ హెచ్డీఎఫ్సీ కరెన్సీ చెస్ట్ నుంచి రూ.7.11 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను తీసుకుని వేర్వేరు ఏటీఎంలలో నింపేందుకు బయల్దేరిన సీఎంఎస్ ఇన్నో సిస్టమ్స్ వారి ఏటీఎం క్యాష్వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అశోకా పిల్లర్ వద్ద అడ్డగించారు.
ప్రభుత్వ స్టిక్టర్ అంటించి ఉన్న ఖరీదైన ఎస్యూవీ వాహనంలో దిగిన ఆ దొంగలు తాము ఆర్బీఐ ఉన్నతాధికారులమంటూ నమ్మబలికారు. డాక్యు మెంట్లను వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ కస్టోడియన్ అఫ్తాబ్, గన్మెన్ రాజన్న, తమ్మయ్యలనూ తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ వాహనాన్ని అనుసరించాలని ఏటీఎం క్యాష్ వాహన డ్రైవర్కు సూచించారు. డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పిస్టల్ చూపించి డ్రైవర్ను బెదిరించి కరెన్సీ కట్టలు తీసుకుని ఉడాయించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనంలో దాదాపు ఆరుగురు దొంగలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.


