సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ | Bail Or Jail: Supreme Court Hearing For Arvind Kejriwal Plea Live Updates | Sakshi
Sakshi News home page

మద్యం పాలసీ కేసు.. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌

Sep 13 2024 7:35 AM | Updated on Sep 13 2024 11:42 AM

Bail Or Jail: Supreme Court Hearing For Arvind Kejriwal Plea Live Updates

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దక్కింది. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. 

ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం (సెప్టెంబర్‌ 13)  విచారణ చేపట్టింది. 

విచారణ సందర్భంగా మద్యం పాలసీ కేసులో సీబీఐ అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసింది. కానీ ఎందుకు అరెస్ట్‌ చేసిందో గల కారణాలపై స్పష్టతలేదు. సీబీఐ సమాధానాలు సైతం అర్ధవంతంగా లేవు. అందుకే కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో పాటు జైలు శిక్షను కొనసాగించలేము. కేజ్రీవాల్‌ని సైతం  వాంగ్మూలం ఇవ్వమని బలవంతం చేయలేము అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

సీబీఐపై ప్రశ్నలు సంధించిన సుప్రీం
విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సీబీఐపై విమర్శలు చేశారు. మద్యం పాలసీకి సంబంధించి మార్చి 2023లో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. విచారించిన 22 నెలల సమయం తీసుకుని కేజ్రీవాల్‌ అరెస్ట్‌ చేసింది.  అరెస్ట్‌ చేసేందుకు ఎందుకు అంత సమయం తీసుకుందని ప్రశ్నించారు. 

షరతులతో కూడిన బెయిల్‌
చివరగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. రూ.10లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్‌ మంజూరు చేసింది. అంతేకాదు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడం,అధికారికంగా సంతకాలు చేయడంతో పాటు కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది.  

ఇదీ చదవండి : అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే సంపన్న మహిళ పోటీ 

కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ధర్మాసనం ఈ నెల 5వ తేదీన రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది జూన్‌ 26న సీబీఐ అరెస్టు చేసింది. తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్‌ అరెస్టును హైకోర్టు సమర్థించింది. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆగస్టు 5న ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేయడంతోపాటు బెయిల్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. 

ఇదిలా ఉండగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా, శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన ఇవాళ తీహార్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement