ఆధార్‌కార్డుల జారీకి ‘ఎన్‌ఆర్‌సీ’ మెలిక | Aadhar Card Rules Changed In Assam | Sakshi
Sakshi News home page

అస్సాం: ఆధార్‌కార్డుల జారీకి ‘ఎన్‌ఆర్‌సీ’ మెలిక

Sep 8 2024 7:10 AM | Updated on Sep 8 2024 1:06 PM

Aadhar Card Rules Changed In Assam

గువహటి: ఆధార్‌ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అస్సాంలో ఆధార్‌ కార్డు కావాలంటే జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ)కి దరఖాస్తు చేసుకున్న నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.  అక్టోబర్‌ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. 

అస్సాంలోకి అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ఆధార్‌ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్‌ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని హిమంత శర్మ అన్నారు. అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.

 ఇందుకే ఎన్‌ఆర్‌సీ దరఖాస్తు  రసీదు నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు.  అస్సాంలో ఆధార్‌ కార్డుల జారీ ఇక ఎంతమాత్రం సులభం కాదని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతి అవలంబించాలని కోరారు. బంగ్లాదేశ్‌ వంటి పొరుగుదేశాల నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు.

 ఈ రెండు నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. వ్యక్తులకు ఆధార్‌ కార్డు జారీపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే కేంద్రం వదిలేసిందని ఈ సందర్భంగా హిమంత గుర్తు చేశారు.   ఇందుకే తాము కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement