గువాహటి: అస్సాం రాష్ట్రాన్ని భారీవరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వానల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 98కి చేరుకోగా.. 1.55 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 1,55,849 మంది వరదల ప్రభావానికి గురైనట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా 13 జిల్లాలు శివసాగర్, గోలాఘాట్, నాగావ్, హోజాయ్, సోనిత్పూర్, ధేమాజీ, దర్రాంగ్, బిశ్వనాథ్, కామ్రూప్ , లఖింపూర్, ఉదల్గురి, జోర్హాట్, చరైడియోలో అధికంగా ప్రభావితమయ్యాయి.
గోలాఘాట్లో అత్యధిక ప్రభావం
వరదల ప్రభావం గోలాఘాట్ జిల్లాలో అత్యధికంగా ఉంది. అక్కడ 58,750 మంది వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత శివసాగర్లో 48,286 మంది, జోర్హాట్లో 25,259 మంది ప్రభావితమయ్యారని అక్కడి ప్రభుత్వం వివరాలు ప్రకటించింది. వరదల ఉద్ధృతిని ఎదుర్కొవడానికి 55 సహాయ శిబిరాలు ఏర్పాటు చేయగా అందులో 10 వేల మందికి పైగా ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపింది.
వరదల కారణంగా 10,748.64 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. అలాగే 47,000కు పైగా పశువులు వరదల ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఆగస్టు 9 నుంచి 30వ తేదీ వరకు వరదల వల్ల నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం తెలిపారు.
అనంతరం వారికి పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు అస్సాం వరదలపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. కేంద్రం తరపున వీలైన సహాయ సహకారులు అందిస్తామని పేర్కొన్నారు.


