నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ప్రభుత్వ ఆదీనంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్యాస్ను పీలి్చన 56 మంది ఆస్పత్రి పాలుకాగా, వీరిలో 8 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గోధని గ్రామపంచాయతీలోని నీటిశుద్ధి ప్లాంట్లో 900 కిలోల సామర్థ్యమున్న క్లోరిన్ గ్యాస్ సిలిండరుంది. వేకువజాము నుంచి ఈ గ్యాస్ లీకవడం మొదలైంది.
గమనించిన అధికారులు 5.30 గంటలకు ఆ సిలిండర్ను పూర్తిగా నీటిలో ముంచి, ప్రమాదం తగ్గించారు. అప్పటికే గ్యాస్ను పీల్చిన కొందరు దగ్గు, శ్వాసలో ఇబ్బందులతో అవస్థలు పడ్డారు. ఇందులో 56 మంది ఆస్పత్రి పాలుకాగా, 11 మందిని చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. మరో 45 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న8 మందిని ఐసీయూలో ఉంచారు. గ్యాస్ లీకేజీ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్రామంలోని 200 మీటర్ల పరిధిలోని వారందరినీ ఖాళీ చేయించారు.


