ఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇంగ్లీష్ మాట్లాడే విధానాన్ని.. తన లాంగ్వేజ్తో పోలుస్తూ ఓ వైరల్ రీల్ను తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేశారు. దీంతో సీజేపీ, కంగనా రనౌత్ మధ్య మరోసారి పొలిటికల్ హీట్ నెలకొంది.
సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రీల్లో తొలుత అభిజిత్త్ దీప్కే ఇంగ్లీష్లో మాట్లాడుతున్న దృశ్యాలను చూపించి, ఆ తర్వాత కంగనా ఇంగ్లీష్లో ప్రసంగిస్తున్న వీడియోను చూపించారు. దీనికి “12వ తరగతి చదివిన కంగనా, బోస్టన్ యూనివర్సిటీ చదివిన దీప్కే ఇంగ్లీష్ స్థాయి.. ఒకరు ఫైర్, మరొకరికి రీబూట్ అవసరం” అన్నట్లుగా సెటైర్ వేశారు. అనంతరం ఇంగ్లీష్ మాట్లాడ రాకపోవడం వల్ల తను ఎదుర్కొన్న అనుభవాల్ని పంచుకున్నారు.
‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో తన ఇంగ్లీష్పై నటి సోనమ్ కపూర్ ఎగతాళి చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే ఆ అవమానాలే తనను మరింత బలంగా ఎదగడానికి ప్రేరేపించాయని తెలిపారు. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న పోరాటాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు. ముఖ్యంగా బయట నుంచి వచ్చిన వారిని ఇంగ్లీష్ రాదనే కారణంతో ఎగతాళి చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
CJPపై కంగనా కౌంటర్లు
CJP సభ్యులతో కంగనాకు సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరగడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల CJP అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా కంగనా ఘాటుగా స్పందించారు. 28 ఏళ్ల వయసున్న వ్యక్తి తనను విమర్శించడం గురించి ప్రస్తావిస్తూ.. తాను 20 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, తన వయసులోనే రెండు జాతీయ అవార్డులు అందుకున్నానని కంగనా కౌంటర్ ఇచ్చారు.
అంతేకాదు, తాను ప్రస్తుతం ఎంపీగా ఉండటంతో పాటు నటి, దర్శకురాలు, నిర్మాత, స్క్రీన్రైటర్, పారిశ్రామికవేత్తగా కూడా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పారు. తన స్థాయిలో ఉన్న వ్యక్తి ఎదుర్కొనే ఒత్తిడి, బాధ్యతలు అర్థం చేసుకోవడం.. విమర్శలు చేసే వారికి సాధ్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


