
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విస్వాస్ కుమార్ రమేష్ ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. మిగిలిన 241 మంది మృతిచెందారు. దీంతో విస్వాస్ కుమార్ రమేష్ మృత్యుంజయుడని అంటున్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వష్ కుమార్ రమేష్ ‘11ఏ’ సీటులో కూర్చున్నారు. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ మృతిచెందగా, 40 ఏళ్ల వ్యాపారవేత్త విస్వాస్ కుమార్ రమేష్ శిథిలాల మధ్య నుండి బయటకు నడుచుకుంటూ వచ్చి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. రక్తంతో తడిసిన షర్టుతో కనిపించాడు. తాను ఈ ప్రమాదం నుంచి దాని నుండి ఎలా సజీవంగా బయటపడ్డానో తనకే తెలియడం లేదని ఆయన ‘దూరదర్శన్’కు చెప్పాడు.
రమేష్ ప్రాణాలతో బయటపడిన దరిమిలా అతను కూర్చున్న ‘11ఏ’ సీటు సురక్షితమైనదంటూ పలు వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రమేష్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడంటూ చెబుతున్నారు. ఈ నేపధ్యంలో విమానయాన నిపుణుడు అంగద్ సింగ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. వివిధ విమాన ప్రమాదాల గణాంకాల ప్రకారం, విమానంలో కొన్ని సురక్షితమైన సీట్లు ఉంటాయి. మధ్యలో ఉన్న సీట్ల కంటే చివర లేదా కుడి ముందు భాగంలో ఉన్న సీట్లు సురక్షితమైనవని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందుకు భిన్నంగా జరిగిందన్నారు. సీటు 11ఏ విమానం మధ్యలో, రెక్క ముందు ఉందన్నారు. ఈ ఘటన అద్భుతమని, ఇంకా చెప్పేందుకు మరో పదం లేదన్నారు.
విమానాలకు సంబంధించి ప్రతి ప్రమాదం భిన్నంగా ఉంటుందని, సీటు స్థానం ఆధారంగా సురక్షితమనేది తేల్చిచెప్పడం అసాధ్యమని అమెరికాకు చెందిన ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ డైరెక్టర్ మిచెల్ ఫాక్స్ పేర్కొన్నారు. కాగా మీడియా నివేదికల ప్రకారం 2007 పాపులర్ మెకానిక్స్ అధ్యయనం ప్రకారం విమానం వెనుక వైపు ఉన్న సీట్లు సురక్షితమైనవని తేలింది. కొంతమంది నిపుణులు రెక్కల దగ్గరుస్న సీట్లు సురక్షితమైనవని చెబుతుంటారు. కాగా ఈ ప్రమాదంపై దర్యాప్తునకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు.
ఇది కూడా చదవండి: Air India crash: ‘నువ్వెళ్లు.. నేను జాయిన్ అవుతా’.. అదే స్నేహితుని చివరి మాట..