‘గబ్బర్ సింగ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేశ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కి గురికావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా లేదని, పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అపోలో వైద్య బృందం వెల్లడించింది.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) ద్వారా రమేశ్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఆ సినిమాలో వచ్చే ‘అంత్యాక్షరి’ కామెడీ ఎపిసోడ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కల్యాణ్తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అనంతరం అత్తారింటికి దారేది సినిమాలో కూడా కాసేపు కనిపించారు. వీటితో పాటు టాలీవుడ్లో పలు చిన్న, మధ్యతరహా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ పాత్రల్లో నటించాడు. సోషల్ మీడియాలో కూడా రమేశ్ యాక్టివ్ గా ఉంటాడు. రెండు రోజుల క్రితమే షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియోని కూడా షేర్ చేశాడు.


