జమ్ము కశ్మీర్లో అట్టహాసంగా తొలి అంతర్జాతీయ చిత్రోత్సవాలు
జమ్ము కశ్మీర్లో తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 10 వరకు నాలుగు రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ జమ్ము కశ్మీర్ (ఐఎఫ్ఎఫ్జేకే) వేడుక జరుగుతుంది. సెప్టెంబరు 7న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ చిత్రోత్సవాలను శ్రీనగర్లో ప్రారంభించారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) సహకారంతో జమ్ము కాశ్మీర్ ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (డీఐపీఆర్) విభాగం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. ‘రంగ్–ఎ–సినిమా’ అనేది ఈ ఫిల్మ్ ఫెస్టివల్ థీమ్.
ఉత్తమ చిత్రానికి రూ. 25లక్షల రివార్డు
ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధానంగా తొమ్మిది అవార్డులను అందించనున్నారు. ఈ అవార్డుల కోసం రూ. 96 లక్షల ప్రైజ్ మనీని కేటాయించగా, ఉత్తమ చిత్రానికి రూ. 25 లక్షల నగదును అందించనున్నారు నిర్వాహకులు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్–డైరెక్టర్ సంతోష్ శివన్ జ్యూరీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘‘దాదాపు 80కి పైగా దేశాలకు చెందిన 1100 సినిమాలను పరిశీలించి, 41 దేశాలకు సంబంధించిన 135 చిత్రాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్కు షార్ట్ లిస్ట్ చేశాం. భారతదేశం నుంచి 64 సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి.
టర్కీ, జర్మనీ, రష్యా, సౌత్ కొరియా, తైవాన్ వంటి విదేశీ చిత్రాలను కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తాం’’ అని ఫిల్మ్ఫెస్టివల్ నిర్వాహక ప్రతినిధుల్లో ఒకరు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ పనోరమా, భారత్ పనోరమా, సినిమా ఆఫ్ ది వరల్డ్... ఇలా ఏడు విభాగాల్లో ఈ 135 సినిమాలను ప్రదర్శించనున్నారు. జమ్ము కశ్మీర్లోని అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని, పర్యాటక రంగ ప్రాధాన్యతను ప్రపంచ దేశాల చలనచిత్ర నిర్మాతలకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్తో పరిచయం చేయడం ద్వారా ఫిల్మ్ టూరిజంను ప్రోత్సహించడం అనేది ఈ ఫిల్మ్ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
డెడ్ డాగ్తో ప్రారంభం
లెబనాన్ దేశానికి చెందిన ‘డెడ్ డాగ్’ సినిమాతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. లేడీ డైరెక్టర్ సారా ఫ్రాన్సిస్ తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఐదా, వాలిద్ భార్యాభర్తలు. వృత్తి రీత్యా వాలిద్ విదేశాల్లో ఉంటాడు. భార్య తన సొంతూరులో ఉంటుంది. అయితే వాలిద్ ఎవరికీ చెప్పకుండా స్వదేశంలోని తన పాత ఇంటికి వస్తాడు. కానీ అక్కడికి వెళ్లి తన భర్త వాలిద్కు ఐదా సర్ప్రైజ్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ దంపతులు ఆ ఇంట్లోనే నాలుగు రోజులు ఉండాల్సి వస్తుంది.
కానీ సుదీర్ఘకాలం దూరంగా ఉండటం వల్ల ఈ దంపతుల మధ్య ఏర్పడిన భావోద్వేగ దూరం, ఒకరిపై ఒకరికి ఉన్న అపనమ్మకాలు ఈ నాలుగు రోజుల్లో ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని వాలిద్ తన భార్యకు చెప్పడు. తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న ‘పెట్ డాగ్’ చని΄ోయిందనే నిజాన్ని ఐదా తన భర్తకు చెప్పకుండా దాచడానికి ప్రయత్నిస్తుంది. మరి... ఆ తర్వాత ఏం జరిగింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇక తొలి రోజు ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్, నటుడు తహా షా బదు షా, దర్శకుడు విధు వినోద్ చోప్రా తదితర ప్రముఖులు చిత్రోత్సవాలకు హాజరయ్యారు.


