● రాష్ట్రంలో 12 కేసులు, 4 మరణాలు ● కంగారెత్తిస్తున్న మహమ్మారి ● పీహెచ్సీల్లో కానరాని ఏర్పాట్లు ● కర్నూలు జీజీహెచ్లో ప్రత్యేక వార్డు
కర్నూలు(హాస్పిటల్):జిల్లా వ్యాప్తంగానే గాక దేశంలో 2020, 2021లో వణికించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుందా... అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే అవుననే అనిపిస్తోంది. గతంలో ఈ మహ మ్మారి సోకి వేలమంది ప్రాణాలు కోల్పోగా లక్షలా ది మంది అనారోగ్యంతో బాధపడటమే గాక ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. చాలా కుటుంబాలు ఈ వైరస్ దెబ్బకు రోడ్డున పడ్డాయి. వందేళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి మహమ్మారిని తలచుకుంటేనే ఇప్పటికీ వెన్నులో వణుకుపుడుతుంది. అలాంటి కోవిడ్ ప్రతి రెండేళ్లకు ఒకసారి తన రూపం మార్చుకుని జనంలోకి వస్తూ ఉంది. ఇప్పటికే నాలుగుసార్లు పలు వేరియంట్ల రూపంలో ఇది ప్రజలను కంపితులను చేసింది. తాజాగా రాష్ట్రంలో మళ్లీ కేసులు నమోదు అవుతుండటం కలకలం రేపుతోంది.
ప్రస్తుతం తూతూ మంత్రంగా ఏర్పాట్లు
పక్క రాష్ట్రాల్లో, పక్క జిల్లాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు వైద్యవిధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేవు. లక్షణాలతో వచ్చిన వారికి కనీస పరీక్షలు చేసేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోలేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం ప్రత్యేకంగా పూర్వ ఐడీ వార్డులో పది పడకలతో వార్డును ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలతో వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు 450 ఆర్టీ పీసీఆర్ కిట్లతో 350 ఆర్ఎన్ఏ ఎక్ట్రాక్షన్ కిట్లు, 450 వీటీఎం కిట్లను సిద్దంగా ఉంచారు. ప్రత్యేకంగా నోడల్ అధికారులను, వైద్యబృందాలను ఏర్పాటు చేయలేదు. కోవిడ్కు సంబంధించి ముందస్తు చర్య లు తీసుకునేందుకు అవసరమైన సమావేశం కూడా నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
స్వీయ జాగ్రత్తలే మేలు
కోవిడ్ కేసులు పక్క రాష్ట్రాలు, జిల్లాల్లో నమోదువుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండటం, బహిరంగ ప్రదేశాలకు, జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనరిసరిగా ధరించాలి. దీనివల్ల వైరస్ను సాధ్యమైనంత వరకు అరికట్టడమే గాక ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో పాటు గతంలో మాదిరిగానే శానిటైజేషన్, భౌతికదూరం పాటించాలి. ఎవ్వరికి వారు స్వీయజాగ్రత్తలు పాటిస్తే గతంలో మాదిరిగా వైరస్ వ్యాపించినా ఇబ్బంది ఉండదని వైద్యులు సూచిస్తున్నారు


