నేడు తెరపై కనిపిస్తున్న కొంతమంది స్టార్ హీరోల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగి ఉంటాయి. కొందరు అవకాశాలను అందిపుచ్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటే.. మరికొందరు మధ్యలోనే వెనుదిరుగుతారు. అయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా తన కలను వదులుకోకుండా ముందుకు సాగిన వారిలో కన్నడ స్టార్ యశ్ ఒకరు. రోజుకు రూ.50 కూలీతో టీలు అందించిన ఈ స్టార్ ఇప్పుడు రూ.4,000 కోట్ల భారీ సినిమా ప్రాజెక్టులకు స్టార్గా నిలిచాడు.
బస్సు డ్రైవర్ కుమారుడిగా..
హసన్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో నవీన్కుమార్ గౌడగా జన్మించిన యశ్.. ప్రభుత్వ బస్సు డ్రైవర్ అరుణ్కుమార్, గృహిణి పుష్ప దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తమ కుమారుడు జీవితంలో ఎదుగుతాడనే నమ్మకాన్ని ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ కోల్పోలేదు.

తొలి ప్రయత్నం విఫలం..
చిన్నప్పటి నుంచే యశ్కు సినిమాలంటే ఎంతో ఇష్టం. దీంతో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత తన కలను నెరవేర్చుకోవడానికి బెంగళూరుకు వెళ్లాడు. సహాయ దర్శకుడిగా మారాలన్న ఆయన తొలి ప్రయత్నం అందని ద్రాక్షగానే మిగిలింది. అయినా నిరాశ చెందకుండా బీవీ కారంత్కు చెందిన బెనక నాటక బృందంలో రోజుకు రూ.50 వేతనంతో పనిచేశాడు. కళాకారులకు టీలు అందించడం, వేదికలను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూనే నటనపై దృష్టి పెట్టాడు.
బుల్లితెరతో గుర్తింపు..
2004లో నాటక రంగంలో తొలి ప్రధాన పాత్రను దక్కించుకున్న యశ్.. అదే ఏడాది బుల్లితెరపై కూడా అడుగుపెట్టాడు. అనంతరం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 2007లో 'జంబాడ హుడుగి' చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన యశ్.. 'మొగ్గిన మనసు' సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత 'మోడలసాల', 'కిరాతక', 'లక్కీ', 'జాను' వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. 2012 నుంచి 2014 వరకు వచ్చిన 'డ్రామా', 'గూగ్లీ', 'రాజా హులి', 'గజకేసరి', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' చిత్రాలు ఆయనను కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా నిలబెట్టాయి.
తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు..
అయితే, యశ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'రాకీ భాయ్' పాత్రతో యశ్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యాడు.
నాలుగేళ్ల విరామం తర్వాత యశ్ 'టాక్సిక్', 'రామాయణ' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఈ రెండు చిత్రాలు భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులుగా నిలిచాయి. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న 'రామాయణ', రూ.500 కోట్ల వ్యయంతో రూపొందుతున్న 'టాక్సిక్' చిత్రాల్లో నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. రోజుకు రూ.50 కూలీతో ప్రారంభమైన యశ్ ప్రయాణం.. నేడు వేల కోట్ల ప్రాజెక్టులకు నాయకత్వం వహించే స్థాయికి చేరడం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం.


