
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన కొత్త సినిమా 'ఏస్' (Ace) ఓటీటీలోకి వచ్చేసింది. మే 23న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీగా ఆకట్టుకున్న ఈ మూవీని ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, కీలక పాత్రలలో నటించారు. రీసెంట్గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి తర్వాత ఏస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ వీకెండ్లో ఓటీటీలో మీరూ ఈ చిత్రాన్ని చూసేయండి.
'ఏస్' (Ace) చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ చిత్రాన్ని జూన్ 13న అందుబాటులోకి తీసుకొచ్చారు. తమిళ్తో పాటు తెలుగు వర్షన్ను ఒకేసారి విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
కథ
బోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్ కన్నన్.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్ ప్రేమలో పడతాడు. అయితే, కల్పన తన హోటల్ కోసం తీసుకున్న లోన్ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు.
దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్ పెళ్లి చేసుకుంటాడా..? అసలు బోల్ట్ కన్నన్ గతం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.