
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకే రోజు 15 సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘దివంగత నిర్మాత డి. రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ నిర్మాతగా ఆ ఘనత నా సొంతమైంది. మా భీమవరం టాకీస్పై ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాలను ప్రారంభించనున్నాను.
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ అరుదైన ఘట్టానికి శ్రీకారం చుడుతున్నాను. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రక ఘట్టానికి హైదరాబాద్లోని సారధి స్టూడియో వేదిక కానుంది. సినిమాతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు.