2026లో అప్పుడే ఆరు నెలలు పూర్తయిపోయాయి. తెలుగులో 100కి పైగా సినిమాలు ఈ ఆరు నెలల్లో థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో ప్రేక్షకుల్ని అలరించి హిట్ అయిన మూవీస్ ఎన్ని అంటే? వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఫ్లాప్ చిత్రాలు ఏ భాషలోనైనా ఉంటాయి. అది సహజమే. కానీ ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నా ఒక్కటి సరిగా ఆడట్లేదు. దీంతో ప్రేక్షకుల కనిపించక థియేటర్లు వెలవెలబోతుండటం ఆందోళన కలిగించే విషయం. ఆ స్థాయి మూవీస్ లేక ఎగ్జిబిటర్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఈ ఏడాది తొలి ఆరు నెలల టాలీవుడ్ రిపోర్ట్ కార్డ్ ఏంటి? ఎన్ని మార్కులు వచ్చాయి?
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)
ఈ ఏడాది ప్రారంభంలో బాక్సాఫీస్ దగ్గర శుభారంభం దక్కింది. సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజైతే వాటిలో చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకరవరప్రసాద్'.. కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' కూడా మంచి వసూళ్లు అందుకోగా.. శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఊహించని హిట్గా నిలచి ట్రేడ్ని ఆశ్చర్యపరిచింది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ 'రాజాసాబ్' ఘోరమైన డిజాస్టర్ కాగా.. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.
ఇక ఫిబ్రవరి అయితే చాలా నీరసంగా సాగింది. జనవరి జోష్ని కొనసాగిస్తుందనుకుంటే.. 'కపుల్ ఫ్రెండ్లీ' మాత్రమే హిట్ అయింది. ఫంకీ, సీతా పయనం, యుఫోరియా చిత్రాలు కనీసం పెట్టుబడిని కూడా రాబట్టుకోలేకపోయాయి. విష్ణు విన్యాసం చాలా నిరాశపరిచింది. మార్చిలోనూ పెద్దగా మార్పు కనిపించలేదు. 'మృత్యుంజయ్' తేలిపోయింది. నెల చివరలో కాస్తంత హైప్తో వచ్చిన పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉసూరుమనిపించింది. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ రెండో రోజే దారుణమైన డ్రాప్ కనిపించింది.
ఏప్రిల్లో పరిస్థితి కొంతవరకు పర్లేదు. అడివి శేష్ 'డెకాయిట్' ఓకే అనిపించుకోగా.. 'రాక్షస' యావరేజ్ అయింది. 'బైకర్'కి ప్రశంసలు వచ్చినప్పటికీ అవి కలెక్షన్స్గా మారలేదు. వేసవిలో కీలకమైన మే నెల కూడా ఎగ్జిబిటర్లని పూర్తిగా నిరాశపరిచింది. గోదారి గట్టుపైన, జెట్ లీ, గాయపడ్డ సింహం మూవీస్ మిడ్ రేంజ్ అయినప్పటికీ కొంత ఆసక్తిగా అనిపించాయి. కానీ కమర్షియల్గా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.
(ఇదీ చదవండి: పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా: కాయదు లోహర్)
ఇక జూన్ నెల పరిస్థితి కొంతవరకు పర్లేదని చెప్పొచ్చు. రామ్ చరణ్ 'పెద్ది' కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల వరకు లాభదాయకంగా నిలిచింది. కానీ మిగతా చోట్ల ఎక్కడా అస్సలు వర్కౌట్ కాలేదు. పేరుకే పాన్ ఇండియా రిలీజ్ చేశారు గానీ అస్సలు పనవ్వలేదు. అయితే ఈ నెలలో ఊహించని సక్సెస్ ఏదైనా ఉందంటే అది 'మా ఇంటి బంగారం'. చాన్నాళ్ల తర్వాత అది కూడా సమంత చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. పెద్దగా బజ్ లేనప్పటికీ థియేటర్లలో అద్భుతం చేసింది. పెట్టుబడి కంటే ఎక్కువగా కలెక్షన్స్ సాధించింది. ఇండస్ట్రీకి ఊపు తీసుకొచ్చింది. ఇక 94 ఏళ్ల దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తీసిన 'సింగ్ గీతం'.. విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది కానీ డబ్బులు రాబట్టుకోలేకపోయింది.
ఇక డబ్బింగ్ల విషయానికొస్తే మార్చిలో రిలీజైన 'ధురంధర్ 2'.. తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల వసూళ్లు సాధించింది. సూర్య 'వీరభద్రుడు'కి బీ,సీ సెంటర్లలో డబ్బులొచ్చాయి. అంచనాలతో వచ్చిన దృశ్యం 3, కేడీ చిత్రాలు డిజాస్టర్లు అవ్వడంతో పాటు థియేటర్లలో నుంచి త్వరగానే వెళ్లిపోయాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది తొలి ఆరు నెలలు పూర్తి సంతృప్తి ఇవ్వలేకపోయాయి. మన శంకరవరప్రసాద్, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, పెద్ది, మా ఇంటి బంగారం మూవీస్ మాత్రమే హిట్. అంటే 95 శాతం సినిమాలు యావరేజ్, ఫ్లాప్, డిజాస్టర్లు అయ్యాయి! దీంతో సెకండాఫ్లోనైనా హిట్స్ శాతం పెరుగుతుందేమోనని హీరోలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
(ఇదీ చదవండి: మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'?)


