
పాటలు నృత్యాలు. అలాగే డ్యాన్స్ నంబర్లు 30వ దశకంలో టాకీల రోజుల నుంచే భారతీయ చలనచిత్రంలో భాగమయ్యాయి . వ్యాంప్ కేరెక్టర్లకు పరిమిమైన వారు మాత్రమే కాకుండా ఏకంగా హీరోయిన్లు ఈ తరహా నృత్యాలు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి వీటిని కాస్త హుందాగా ఐటెమ్/స్పెషల్ సాంగ్స్ లేదా ప్రత్యేక నృత్యాలుగా పిలుస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్(Item Song)లు సినిమాల విజయాలకు చాలా కీలకమైనవిగా మారాయి. దాంతో పాటే ఈ తరహా నృత్యాల కోసం డ్యాన్సర్లు, హీరోయిన్లు వసూలు చేసే రెమ్యూనరేషన్ కూడా ఆకాశాన్ని అంటింది.
బాలీవుడ్కి చెందిన నోరా ఫతేహి వంటి ప్రముఖ డ్యాన్సర్లు ఒక్కో పాటకు 2 కోట్ల రూపాయల చొప్పున, సన్నీ లియోన్ కూడా అంతే మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్లో కెవ్వు కేక అంటూ కేక పెట్టించిన మలైకా అరోరా పాటకు రూ. 50 లక్షల నుంచి 1కోటి వరకు వసూలు చేస్తూ ఇప్పుడు కాస్త వెనకడుగులో ఉంది.
ప్రముఖ నటీమణులు ఈ డ్యాన్స్ నంబర్లకు వసూలు చేస్తున్న మొత్తాలు వారి డ్యాన్స్ సామర్థ్యాల కంటే చాలా ఎక్కువ అనేది వాస్తవం. అయితే డ్యాన్స్ ప్రతిభ కన్నా తమ స్టార్ పవర్ను వీరు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరీనా కపూర్ ఐటెం సాంగ్ చేసేటప్పుడు రూ. 1.5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసేదట. , కత్రినా కైఫ్ ఒక్కో పాటకు 2 కోట్ల రూపాయలకు పైగా అందుకుందట.
ఈ తరహా పాటలకు పేరొంది అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రతి పాటకు రూ. 3 కోట్లు తీసుకుంటుంది. దబిడి దిబిడి భామ ఊర్వశి రౌతాలా కూడా అంతే మొత్తం అడిగేది..ఇప్పుడు మరింత ఎక్కువ డిమాండ్ చేస్తోంది. సినీ పండితుల సమాచారం ప్రకారం, తమన్నా భాటియా, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, తాప్సీ పన్ను వంటి వారు ఇప్పుడు ఐటమ్ నెంబర్స్లో డిమాండ్లో ఉన్నారు.
ఈ కోవలో నిన్నా మొన్నటి దాకా అత్యధిక పారితోషికం అందుకున్న రికార్డ్ నటి సమంత పేరిట ఉంది. ఆమె పుష్ప ది రైజ్లో ఊ అంటావా పాట కోసం అత్యధిక మొత్తం వసూలు చేసినట్లు సమాచారం. ఒక సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ చేయడం ద్వారా ఆ సినిమా మొత్తం కనిపించిన హీరోయిన్ కన్నా ఎక్కువ మొత్తం అందుకుందీమె. పుష్పలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్న మొత్తం సినిమాకి కేవలం రూ. 2 కోట్లు మాత్రమే తీసుకుంటే. అయితే ఊ అంటావా పాట కోసం సమంత రూ. 5 కోట్ల పారితోషికాన్ని రాబట్టిందట.
ఇటీవలి కాలంలో తమన్నా ఐటమ్ ట్రెండ్స్లోకి అనూహ్యంగా దూసుకొచ్చింది. తెలుగులో స్వింగ్ జర స్వింగ్ జర అంటూ జూనియర్ ఎన్టీయార్ పక్కన మెలికలు తిరిగిన ఈ మిల్కీ బ్యూటీ అలా మొదట్లో రూ.కోటిలోపే తీసుకుంటూ అప్పుడప్పుడు ఐటమ్గాళ్ గా కనిపించినా...ఇప్పుడు స్పెషల్ సాంగ్ అంటే తానే గుర్తొచ్చేంతగా ఎదిగిపోయింది. దీనికి వరుసగా ఆమె ఐటమ్ సాంగ్స్ హిట్ కావడమే కారణం.
రూ.3కోట్లు తీసుకుని జైలర్ లో ‘నువ్వు కావాలయ్యా..దా’ పాటలో ఊపేసిన తమన్నా సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోలకు బోలెడంత ఫీడ్ అందించింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా స్త్రీ 2 ఆమెని మరింత అందనంత ఎత్తుకి తీసుకెళ్లింది. ఆ సినిమాలోని ఆజ్కి రాత్... పాట ఉత్తరాది ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవడంతో తాజాగా రైడ్ 2లో చేసిన ఐటమ్ సాంగ్ కోసం రూ.5కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్లలో తమన్నా భాటియా అత్యధిక మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్గా నిలిచింది.