‘రామాయణ’ సినిమా విడుదల విషయంలో చిన్న మార్పు ఉన్నట్లు ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబె, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పతాకంపై నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.
కాగా, ‘రామాయణ పార్ట్ 1’ ఈ ఏడాది దీపావళికి, ‘రామాయణ పార్ట్ 2’ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. అయితే తొలి భాగం ఇండియాలో కంటే ముందుగా విదేశాల్లోనే విడుదల కానుంది. ‘‘విదేశీ మార్కెట్లలో సినిమాల విడుదల సాధారణంగా శుక్రవారం నుంచే ప్రారంభం అవుతుంది. అందుకే అక్కడ నవంబరు 6న ‘రామాయణ పార్ట్ 1’ని రిలీజ్ చేస్తాం. ఇండియాలో మాత్రం దీపావళి పండగ రోజునే అంటే... నవంబరు 8నే రిలీజ్ చేస్తాం’’ అని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నమిత్ మల్హోత్రా.


