తెలుగు స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు త్రివిక్రమ్. అతడు, అత్తారింటికి దారేది, అరవింద సమేత, అల వైకుంఠపురములో, జులాయి, ఖలేజా, సన్నాఫ్ సత్యమూర్తి, జల్సా, నువ్వే నువ్వే, అఆ తదితర సినిమాలతో తనదైన పేరుని సొంతం చేసుకున్నారు. అభిమానులతో ముద్దుగా మాటల మాంత్రికుడు అని పిలిపించుకుంటూ ఉంటారు.
(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)
అయితే గత పదేళ్ల కాలంలో త్రివిక్రమ్ తీసిన సినిమాలు చూస్తే.. అన్నీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించారు. ఇలా ఒకే నిర్మాతతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారనే దానికి నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో త్రివిక్రమ్-తమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'బాబాయి(చినబాబు).. ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు మొదటి మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నారు. త్రివిక్రమ్ పనితీరు, సినిమాలపై ఆయనకున్న అభిమానం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 'జులాయి' తొలి చిత్రం. ఇది ప్రారంభమైనప్పటి నుంచి త్రివిక్రమ్తో మా అనుబంధం మరింత బలపడింది. 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ పేరుని ఆయనే సూచించారు. లోగో కూడా త్రివిక్రమ్ డిజైన్ చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన బయట బ్యానర్(నిర్మాణ సంస్థ)లో సినిమా చేయలేదు. దీనికి ఎలాంటి అగ్రిమెంట్స్ లేవు. మా మధ్య ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. ఓ కుటుంబంలా అయిపోయాం' అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.
త్రివిక్రమ్ ప్రస్తుతం తీస్తున్న 'ఆదర్శ కుటుంబం', త్వరలో ఎన్టీఆర్తో తీయబోయే మూవీ కూడా ఇదే సంస్థలో నిర్మిస్తున్నారు. మరోవైపు నాగవంశీ.. సితార నిర్మాణ సంస్థ తరఫున పలు మూవీస్ తీస్తూ బిజీగా ఉన్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ)


