
ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ (mad square) చిత్రం మంచి టాక్తో దూసుకెళ్తోంది. మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఈ మధ్యకాలం అత్యధిక వసూళ్లను రాబట్టిన చిన్న చిత్రంగా రికార్డు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ సాధించడంతో పెంచిన టికెట్ల ధరను సాధారణ స్థాయికి తీసుకువచ్చామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ( Suryadevara Naga Vamsi) తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా గురించి నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై గ్రహం వ్యక్తం చేశాడు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ఆయన ప్రశ్నించారు.
‘సినిమా రిలీజ్ తర్వాత రివ్యూలు వచ్చాయి. అప్పుడు ప్రెస్ మీట్పెట్టాను కానీ నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ల పని వాళ్లు చేశారు అనుకున్నాను. కానీ, సినిమా బాగా ఆడుతున్నప్పటికీ.. ఆ రివ్యూల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతోందని అంటున్నారు. ఈ సినిమ ఎలా ఉన్నా చూడటానికి ఇదేమైనా ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2’ కాదు కదా! సినిమా ఆశించినంత లేకపోయినా చూడటానికి ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు.
‘మ్యాడ్ స్క్వేర్’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. వేరే మూవీలు బాగోలేవని దీన్ని చూడటం లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. కంటెంట్ లేదు. సెకండాఫ్ పండలేదని అంటున్నారు. నేను థియేటర్లో చాలాసార్లు సినిమా చూశా. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూవర్లకు తెలియడం లేదా?
మీరు (మీడియా) మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్సైట్స్ రన్ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్ పనిచేస్తాయి. దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి. నా సినిమా ఆర్టికల్స్ రాయకండి. నా సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు.సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి’ అని నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.