ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆమెకు పార్టీ కండువా కప్పి అధికారికంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సినీ రంగంలో కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రేష్టి వర్మ ఇటీవల కాలంలో చేసిన పాటలు విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రంలోని ‘సుసేకి’ పాటకు ఆమె అందించిన కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాటకు కూడా ఆమె పనిచేశారు.
హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో పలు స్టార్ హీరోల సినిమాలకు ఆమె పనిచేశారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. గతంలో జానీ మాస్టర్పై ఆమె లైంగిక వేధింపులు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతంలో జానీ మాస్టర్పై కేసు..
గతంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ వచ్చిన ఈమె.. అతడిపైనే ఆరోపణలు చేయడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. శ్రేష్టి వర్మ ఆరోపణలు, ఫిర్యాదు చేయడం వల్ల జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల పాటు జైలులో ఉంచారు. తర్వాత బెయిల్పై బయటకొచ్చిన జానీ.. ప్రస్తుతం ఆడపాదడపా పాటలు చేస్తున్నారు.
జానీ మాస్టర్ ‘వ్యవహారం’లో గతంలో స్పందించిన జనసేన
అప్పటి ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై హైదరాబాద్లో లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై ఆ పార్టీ స్పందించింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ (జానీ మాస్టర్)ని ఆదేశించింది. ఆయనపై కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
చదవండి: తండ్రి కుల వ్యవస్థకు వ్యతిరేకం.. అందుకే నా ఇంటిపేరు ‘బచ్చన్’


