
నా చిత్రాల్లో నటించిన తరువాత కథానాయకులు రాజకీయాల్లోకి వెళ్లారని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఇంతకుముందు కోలీవుడ్లో ఆయన ఇండియన్ (భారతీయుడు), ఆరంభం, ఎన్నై అరిందాల్ (ఎంతవాడు గాని), వేదాళం వంటి పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఈయన తాజాగా నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఇందులో నిధిఅగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునిల్, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందించారు. రవికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో జూన్ 12న తెరపైకి రానుంది.
ఈ సందర్భంగా తాజాగా ఆ చిత్రంలోని తార తార అనే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు కేఎస్.రవికుమార్, కేఆర్ పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఏఎం రత్నం మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చిందని, హరిహర వీరమల్లు చిత్రానికి రెండవ భాగం చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి తన కొడుకు రవికృష్ణ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. కాగా తన చిత్రాల్లో నటించిన తరువాత ఆయా చిత్రాల కథానాయకులు రాజాకీయాల్లోకి ప్రవేశించారని చెప్పారు.
నటుడు శరత్కుమార్, విజయ్కాంత్, విజయ్, విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారని, పవన్కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారని ఇది యాదృఛ్చకంగా జరిగిందో ఏమో తెలియదని ఆయన పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రవికృష్ణ మాట్లాడుతూ తాను ఏడెనిమిది ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం హరిహరవీరమల్లు అని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్కల్యాణ్ పిలిచి తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని, తాను మాత్రం మీ తండ్రికి అభిమానినని, ఆయన బాగుండాలని, ఆయన లెగసీని నువ్వు కొనసాగించాలని చెప్పారని రవికృష్ణ పేర్కొన్నారు.