
మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. చాన్నాళ్లుగా ఈ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అలా 'ప్రావింకుడు షప్పు' పేరుతో ఓ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
కథేంటి?
అడవికి సమీపంలో ఓ ఊరు. బాబు (శివజిత్) ఓ కల్లు దుకాణం నడుపుతూ ఉంటాడు. ఓ రోజు రాత్రి వర్షం కురుస్తుండటంతో ఇతడి షాపులో 11 మంది తాగుతూ తెల్లారేవరకు ఉండిపోతారు. ఓ సందర్భంగా బయటకొచ్చి చూస్తే బాబు.. దూలానికి కట్టిన ఉరితాడుకు వేలాడుతుంటాడు. దీంతో దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీస్ అధికారి సంతోష్ (బాసిల్ జోసెఫ్).. ఇది హత్య అని నిర్ధారిస్తాడు. 11 మందిలోనే నిందితుడు ఉన్నాడని అనుమానపడతాడు. చివరకు హత్య చేసినవాడు దొరికాడా? బాబుతో సునీ (చెంబన్ వినోద్), కన్నా (షౌబిన్ సాహిర్)కి గొడవేంటి? అనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
సింపుల్ గా చెప్పుకొంటే.. ఓ మారుమూల గ్రామం, ఓ రాత్రి జరిగిన హత్య, 11 మంది అనుమానితులు.. మరి హంతకుడిని పోలీసులకు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీ. మలయాళంలో ఇదివరకే ఇలాంటి పాయింట్ తో చాలా సినిమాలు తీశారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో చెబుతారు. ఈ మూవీ విషయానికి వచ్చేసరికి డార్క్ క్రైమ్ జానర్ ని ఎంచుకున్నారు. కాకపోతే ఓకే ఓకే అనిపించేలా మాత్రమే తీయగలిగారు.
(ఇదీ చదవండి: 'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు)
హత్య కేసులో 11 మంది అనుమానితులని విచారించినప్పుడు, వాళ్ల నుంచి ఒక్కో క్లూని లాగుతున్నప్పుడు సీన్స్ థ్రిల్లింగ్ గా అనిపించాలి. కానీ ఇందులో చాలాచోట్ల విసుగు పుడుతుంది. తొలుత కల్లు దుకాణంలో పనిచేసే కన్నాని పోలీసులు అనుమానిస్తారు. తర్వాత కాసేపటి సునీ అనే వ్యక్తిపై సందేహం వస్తుంది. తర్వాత మెరిండా అనే పాత్ర ఎంటరవుతుంది. వీళ్లలో దొంగ ఎవరనేది మూవీ చూసే తెలుసుకోవాలి.
కథ పరంగా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ సాంకేతికంగా మాత్రం అలరిస్తుంది. విజువల్స్ తో పాటు నేపథ్య సంగీతం బాగుంది. లొకేషన్స్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తాయి. డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి సరైన సీన్స్ రాసుకుని ఉంటే మంచి థ్రిల్లర్ అయ్యేది.
నటీనటుల విషయానికొస్తే.. విచిత్రంగా ప్రవర్తించే పోలీస్ అధికారి సంతోష్ గా బాసిల్ జోసెఫ్ నటన ఆకట్టుకుంది. కన్నా పాత్రలో సౌబిన్ షాహిర్, సునీ పాత్రలో చెంబన్ వినోద్ చెప్పుకోదగ్గ పాత్రలు. వాటిని సునాయసంగా చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగతా పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఓవరాల్ గా చెప్పుకొంటే.. రీసెంట్ టైంలో వచ్చిన మలయాళ థ్రిల్లర్స్ తో పోలిస్తే ఇది తేలిపోయింది. టైమ్ పాస్ కోసం చూద్దామనుకుంటే మాత్రం ఓసారి ట్రై చేయొచ్చు.
-చందు డొంకాన
(ఇదీ చదవండి: జాన్వీ కపూర్కు లంబోర్గిని కారు గిఫ్ట్)